20 ఏళ్లుగా నో రిక్రూట్మెంట్
పాలమూరు బీఈడీ కాలేజీలో అన్ని ఖాళీలే..
ప్రిన్సిపల్ కూడా ఇన్చార్జీయే..
మహబూబ్నగర్, వెలుగు: కాబోయే పంతుళ్లకు పాఠాలు నేర్పే కాలేజీ అది.. కానీ ఏం లాభం.. ఆ కాలేజీకి ఒక్క లెక్చరర్ కూడా లేరు. ప్రిన్సిపల్ కూడా ఇన్చార్జీయే.. క్లర్కులు, డిప్యూటేషన్పై వచ్చిన లెక్చరర్లతోనే కాలేజీ నడుస్తోంది. దాదాపు 20 ఏండ్ల నుంచి ఇదే సమస్య. డిప్యూటేషన్పై కొంతమందిని తీసుకొచ్చి వారితో నెట్టుకొస్తున్నారు. జిల్లా యంత్రాంగం, నేతలు పట్టించుకోకపోవడంతో సమస్య పరిష్కారం కావడం లేదు. సాక్షాత్తు మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇలాఖాలో ప్రభుత్వ బీఈడీ కాలేజీ పరిస్థితి ఇది. ఎంతోమంది టీచర్లను తయారు చేసిన ఈ కాలేజీ ప్రస్తుతం లెక్చరర్లు లేక వెలవెలబోతోంది. పోస్టుల భర్తీకి ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నా సర్కార్ స్పందించడం లేదు. ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కాలేజీగా 1969లో ప్రారంభమైన ఈ కాలేజీ 1995న బీఈడీ కాలేజీగా మారింది. ఆరుగురు లెక్చరర్లను డిప్యూటేషన్పై తీసుకుని నడిపిస్తున్నామని ఇన్చార్జి ప్రిన్సిపల్ చెబుతున్నారు.
1998 నుంచి రిక్రూట్మెంట్ బంద్..
మహబూబ్నగర్ ప్రభుత్వ శిక్షణ కాలేజీ 1969 అక్టోబర్ 2లో ఏర్పాటైంది. ఉస్మానియా యూనివర్సిటీకి శాశ్వత అనుబంధ కాలేజీల్లో ఇదొకటి. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో ట్రైనింగ్ పొందని టీచర్లకు శిక్షణ ఇచ్చేందుకు దీన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 1995 జులై 24లో బీఈడీ కాలేజీగా మారింది. విచిత్రమేమిటంటే అన్ని జిల్లా శాఖల ఆఫీసర్లు ఉండే పాలమూరు జిల్లా కేంద్రంలోని బీఈడీ కాలేజీలో గత విద్యా సంవత్సరం నుంచి ఒక్క లెక్చరర్ కూడా లేరు. వివిధ విభాగాలకు 15 మంది లెక్చరర్లు అవసరం ఉండగా.. ఒక్కరూ లేకపోవడం గమనార్హం. స్టూడెంట్స్కు పాఠాలు ఎవరు బోధిస్తారనే విషయంపై ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం విస్మయం కలిగిస్తోంది. ప్రిన్సిపల్ పోస్టుకు కూడా నాగర్కర్నూల్ డీఈవో ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. 1998 నుంచి రిక్రూట్మెంట్లు లేకపోవడంతో లెక్చరర్ల పోస్టులు భర్తీ కావడం లేదు.
స్టూడెంట్స్ భవిష్యత్ ప్రశ్నార్థకం..
కాలేజీలో ఎడ్సెట్ ద్వారా ఏటా వంద మంది స్టూడెంట్స్ అలాట్ అవుతారు. రెండేళ్ల కోర్సు చేసి పట్టా పొందుతారు. ఆ తర్వాత టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్కు ఎలిజిబుల్ అవుతారు. కానీ ఈ కాలేజీలో ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ ఇక్కడ జాయిన్ అయ్యాక తమ స్వశక్తిని నమ్ముకుని పరీక్షలు రాయాల్సి వస్తోంది. లెస్సన్స్ చెప్పేవారు లేక ఇందులో చదువుతున్న స్టూడెంట్స్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇన్చార్జి ప్రిన్సిపల్గా నాగర్కర్నూల్ డీఈవోకు ఇచ్చారు. ప్రస్తుతం బీఈడీ కాలేజీలో అలాట్ అయిన వాటిలో 2 తెలుగు పోస్టులు, 2 హిందీ, 2 బయో సైన్స్, 2 సోషల్ స్టడీస్, ఉర్దూ, ఫిజికల్సైన్స్, మ్యాథ్స్, ఫిలాసపీ, స్కూల్ అడ్మిన్, మనో విజ్ఞాన శాస్త్రానికి సంబంధించి ఒక్కో లెక్చరర్ పోస్టు ఖాళీ ఉంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ హిందీ, లైబ్రేరియన్, ఫిలిం ఆపరేటర్, డ్రాయింగ్మాస్టర్, మాన్యువల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులూ ఖాళీగా ఉన్నాయి.
ఆరుగురితో ఆన్లైన్లో క్లాసులు..
ఈ ఏడాది కోవిడ్ ప్రభావంతో ఆన్లైన్ క్లాసులు నడిపించాల్సి ఉండగా ఆరుగురు లెక్చరర్లతో క్లాసులు నిర్వహిస్తున్నారు. ఈసారి ఎడ్సెట్ రాసిన స్టూడెంట్స్ 100 మంది అడ్మిషన్లు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. లెక్చరర్ల కొరత కారణంగా ఇప్పుడు కాలేజీలో చేరబోయే స్టూడెంట్స్ ఆందోళన చెందుతున్నారు. లెక్చరర్ పోస్టులను భర్తీ చేయాలని ఉన్నతాధికారులను కోరుతున్నారు. బోధననేతర సిబ్బందిలోనూ ఖాళీలు ఉన్నాయి.
మంత్రి చొరవ చూపాలి
మహబూబ్నగర్ బీఈడీ కాలేజీలో కొన్నేళ్లుగా లెక్చరర్లు లేరు. ఎడ్సెట్లో మంచి ర్యాంకులు సాధించిన స్టూడెంట్స్ ఈ కాలేజీకి అలాట్ అయ్యాక చాలా నర్వస్ అవుతున్నారు. స్టూడెంట్స్ సొంతంగా చదివి పాసవుతున్నారు. కాలేజీలో లెక్చరర్ల కొరత తీర్చే విషయంలో మంత్రి శ్రీనివాస్గౌడ్ చొరవ చూపాలి. -శ్రీధర్, బీఈడీ స్టూడెంట్, మహబూబ్నగర్.
ఆరుగురితో నెట్టుకొస్తున్నాం
బీఈడీ కాలేజీలో లెక్చరర్ల కొరత ఉన్నది వాస్తవమే. 15 మంది రెగ్యులర్ పోస్టులకు ఒక్కరు కూడా లేరు. ఉన్నతాధికారులకు విన్నవించి ఆరుగురు లెక్చరర్లను డిప్యూటేషన్పై తీసుకుని ఆన్లైన్ క్లాసులు నడిపిస్తున్నాం. స్టూడెంట్స్కు ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.– గోవిందరాజులు, ఇన్చార్జి ప్రిన్సిపల్