- రూ.10 లక్షలు, 190 గ్రాములతో పరారైన వ్యక్తి అరెస్ట్
పద్మారావు నగర్, వెలుగు: బ్యాంక్ఉద్యోగిగా నమ్మించి భారీ లోన్ ఇప్పిస్తానని ఓ మహిళను మోసం చేసిన వ్యక్తిని రామ్గోపాల్పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ జోన్ అదనపు డీసీపీ నరసయ్య శనివారం ఈ కేసు వివరాలను వెల్లడించారు. తుర్కపల్లి భరత్ సాయిచంద్ర అనే వ్యక్తి తనను ఐడీఎఫ్సీ బ్యాంక్ ఉద్యోగిగా పరిచయం చేసుకున్నాడు. రాఖీ జైన్ అనే మహిళకు సుమారు రూ.2.80 కోట్ల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. లోన్ ప్రాసెసింగ్ పేరుతో ఆమె నుంచి రూ.10.69 లక్షలు, అలాగే 190 గ్రాముల బంగారం తీసుకుని పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడిని శనివారం అంబర్పేటలో అరెస్ట్ చేశారు. అతని నుంచి ఒక కారు, రూ.4 లక్షల నగదు, 160 గ్రాముల బంగారం, ఒక సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 8 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
