జీఎస్టీ అధికారులమంటూ రూ.28 కోట్లు మోసం.. ఇద్దరి అరెస్టు 

జీఎస్టీ అధికారులమంటూ రూ.28 కోట్లు మోసం.. ఇద్దరి అరెస్టు 

జీఎస్టీ డిపార్ట్ మెంట్లో ఉన్నతాధికారులమంటూ మోసం చేసి రూ.28 కోట్లను కాజేసిన ఇద్దరు వ్యక్తులను బాలానగర్ SOT పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్లకు చెందిన నారాయణ గౌడ్(57), వరంగల్ కు చెందిన శైలజ (37) ఇద్దరు గత కొన్ని నెలలుగా పరిచయస్థులు. నారాయణ గౌడ్ కు జీఎస్టీ శాఖపై పట్టు ఉండడంతో ఉన్నతాధికారి అవతారం ఎత్తాడు. నగరంలో పలు ప్రాంతాల్లో స్టీల్, సిమెంట్, గోల్డ్, లిక్కర్ వ్యాపారాలు చేసే వారి వద్దకు వెళ్లి తాను జీఎస్టీలో అసిస్టెంట్ కమిషనర్ అధికారినంటూ పరిచయం చేసుకుంటాడు. జీఎస్టీ లేకుండానే సామగ్రి కొనుగోలు చేసి అధికంగా సంపాదించుకోవచ్చని వారిని నమ్మించాడు. జీఎస్టీలో డిప్యూటీ కమిషనర్ శైలజ సైతం మీకు సహకరిస్తుందని ఆమెను వారికి పరిచయం చేశాడు. దాంతో వారిని నమ్మిన సుమారు 18 మంది అమాయకులు సుమారు రూ.28 కోట్లను వివిధ రూపాల్లో వారికి కట్టబెట్టారు. అనంతరం వారు స్పందించకపోవడంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో కేసు నమోదు చేసి ఆ శాఖలో వారిపై ఆరా తీయగా నకిలీ అధికారులనే విషయం బయట పడింది. 

నిందితులిద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుల వద్ద ఓ కారు, రూ 20 వేల నగదు, 3 ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం నగర వ్యాప్తంగా వారిపై 13 కేసులు నమోదైనట్లు బాలానగర్ డీసీపీ సందీప్ తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఎలాంటి ఆధారాలు లేకుండా ఇటువంటి మోసపూరిత మాటలు విని మోసపోవద్దని పోలీసులు సూచించారు.