- ‘వీ6-వెలుగు’ పేరిట తప్పుడు వార్తల ప్రచారం
- ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అధికార పార్టీ లీడర్లది ఇదే కత
- జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు ఫేక్ సర్వేలు
- ఇప్పుడు హుజూరాబాద్ బైపోల్లో పబ్బం గడుపుకునేందుకు
- ఈటలకు వ్యతిరేకంగా క్లిప్పింగ్లు గతంలో ఫిర్యాదు చేసినా స్పందించని పోలీసులు
నెట్వర్క్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఎట్లయినా గెలవాలని ఆరాటపడుతున్న టీఆర్ఎస్ లీడర్లు సోషల్ మీడియా వేదికగా గోబెల్స్ ప్రచారానికి తెరతీశారు. జరగనిది జరిగినట్లు, జరిగింది జరగనట్లు ఫేక్ న్యూస్ క్రియేట్ చేసి జనాల్లోకి వదులుతున్నారు. నిఖార్సైన వార్తలతో అనతికాలంలోనే తెలంగాణ ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్న ‘వీ6– వెలుగు’ క్రెడిబిలిటీని ఇందుకు ఉపయోగించుకుంటున్నారు. ఇదివరకు జీహెచ్ఎంసీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో ‘వీ6–వెలుగు’ పేరిట ఫేక్ సర్వేలను వైరల్ చేసి ఓటర్లను గందరగోళానికి గురిచేశారు. తాజాగా హుజూరాబాద్లో ఈటల రాజేందర్కు, బీజేపీకి వ్యతిరేకంగా ఫేక్ న్యూస్ క్లిప్పింగులు తయారుచేసి వాట్సప్, ఫేస్బుక్లో వైరల్ చేస్తున్నారు.
జనరల్ ఎలక్షన్స్, బై పోల్స్, మున్సిపోల్స్.. ఇలా ఎన్నిక ఏదైనా పార్టీలన్నీ ముందుగా సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ ప్రారంభిస్తున్నాయి. ఆయా పార్టీలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడంతోపాటు కొత్తగా చేపట్టబోయే స్కీమ్లు, హామీలను జనాల్లోకి తీసుకెళ్తున్నాయి. తద్వారా ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ కొన్ని పార్టీలు ఓ అడుగు ముందుకేసి ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు, ఆరోపణలకు కూడా సోషల్ మీడియాను అడ్డంగా వాడుకుంటున్నాయి. ఈ విషయంలో రూలింగ్పార్టీ లీడర్లు నాలుగు ఆకులు ఎక్కువే చదివారు. మామూలుగా చెబితే జనం నమ్మరు కనుక తెలంగాణలో అత్యధిక క్రెడిబిలిటీ ఉన్న ‘వీ6– వెలుగు’ పేరిట ఫేక్ సర్వేలు, ఫేక్ న్యూస్, ఫేక్ స్టోరీస్ సృష్టించి వైరల్ చేస్తున్నారు. లోగోతో పాటు అచ్చు ‘వెలుగు’ పేపర్లో పబ్లిష్ అయినట్లుగానే ఈ ఫేక్ క్లిప్పింగులు ఉండడంతో జనం కూడా వీటిని నమ్మే ప్రమాదం ఉంది. రూలింగ్ పార్టీ లీడర్లు ఆశించేది కూడా ఇదే! అందుకే ఈ ఏడాది మార్చి నెలలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో ‘వీ6–వెలుగు’ సర్వే చేసినట్లు, టీఆర్ఎస్ క్యాండిడేట్లు ఇద్దరు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నట్లు ఫేక్ క్లిపింగ్స్ వైరల్ చేశారు. అంతకుముందు డిసెంబర్ నెలలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇట్లనే టీఆర్ఎస్కు 92–101 సీట్లు, బీజేపీకి 10–12 సీట్లు వస్తాయని ‘వీ6–వెలుగు’ పేరిట ఫేక్ సర్వే క్లిపింగ్ తయారుచేసి సోషల్ మీడియాలో వదిలారు. ఈ ఫేక్ సర్వేలను సర్క్యులేట్ చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని నవంబర్28న ‘వీ6 –వెలుగు’ ప్రతినిధి సంపత్కుమార్.. సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీ ఎం ప్రసాద్కు ఫిర్యాదు చేశారు. వాట్సప్ పోస్టింగ్స్, యూఆర్ఎల్ లింక్స్ను కూడా ఆయనకు అందజేశారు. బండి సంజయ్ పేరుతో మార్ఫింగ్ అయిన బ్రేకింగ్ న్యూస్ పైనా కంప్లయింట్ ఇచ్చారు. నిందితులను గుర్తించి యాక్షన్ తీసుకుంటామని ఆనాడు ఏసీపీ హామీ ఇచ్చినా నేటికీ ఏ ఒక్కరిపైనా చర్యలు తీసుకోలేదు.
హుజూరాబాద్లో 600 మందితో సోషల్ వారియర్స్
రాబోయే హుజూరాబాద్ ఎన్నికల కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ నేతృత్వంలో ‘సోషల్ మీడియా వారియర్స్’ పేరిట ఏకంగా ఓ స్పెషల్టీమ్ను టీఆర్ఎస్ రంగంలోకి దించింది. నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు 600 మంది యూత్తో ఈ వింగ్ను రన్ చేస్తోంది. వాళ్ల ఖర్చులు, అవసరాలను పార్టీనే భరిస్తోంది. ఈ క్రమంలో ఇటీవల మండలాల వారీగా హుజూరాబాద్, జమ్మికుంట, ఇల్లందకుంటలో వారియర్స్తో మీటింగ్ పెట్టిన బాల్క సుమన్ ప్రచారానికి సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో లెక్చర్ ఇచ్చారు. ప్రభుత్వ స్కీములను ప్రచారం చేసుకోవడంతో పాటు ప్రత్యర్థుల విమర్శలను, ఆరోపణలను ఎలా తిప్పికొట్టాలనే విషయంలోనూ గైడ్ చేశారు. హైదరాబాద్ నుంచి రప్పించిన ఎక్స్పర్ట్స్తో ట్రైనింగ్ కూడా ఇప్పించారు. పది రోజుల కింద హుజూరాబాద్లో జరిగిన మీటింగ్లో బాల్క సుమన్‘ఇక సోషల్ మీడియాలో ప్రతిపక్షపార్టీల సంగతి చూస్తాం’ అని హెచ్చరించారు. ఆ వెంటనే రెండు ఫేక్ న్యూస్లు సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేశారు. వీటిలో సీఎం కేసీఆర్కు ఈటల రాజేందర్ రాసినట్లుగాఉన్న లెటర్ ఒకటి.. అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ కండువా కప్పారన్న ఫొటో న్యూస్ మరోటి. ఈ రెండూ ఫేక్ అని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ లీడర్లు లోకల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు.
తప్పుడు వార్తలతో పబ్బం
ఈటల రాజేందర్ కమలాపూర్ లో ప్రెస్మీట్ పెట్టి ‘రెడ్లు, ముస్లింల ఓట్లు నాకు అవసరం లేదు’ అని మాట్లాడినట్లుగా ఓ ఫేక్ న్యూస్ ను టీఆర్ఎస్ లీడర్లు క్రియేట్ చేసి వైరల్ చేశారు. ఆ మరునాడే.. ఈటల హుజూరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి కమలాపూర్ లో తాను చేసిన వ్యాఖ్యలను తానే ఖండించినట్లుగా, ‘రెడ్లకు రైతుబంధు అవసరం లేదు’ అని మరో వివాదాస్పద వ్యాఖ్య చేసినట్లుగా మరో ఫేక్ న్యూస్ను క్రియేట్ చేశారు. ఇది జులై 1న ‘వెలుగు’ పేపర్లో పబ్లిష్ అయినట్లుగా క్లిప్పింగ్ తయారుచేసి సోషల్ మీడియాలో స్ర్పెడ్చేశారు. ఈ నెల 7న పీసీసీ చీఫ్రేవంత్ను ఈటల రాజేందర్ తిట్టినట్లు మరో క్లిప్పింగ్ను తయారుచేసి వదిలారు. ఈ రెండు క్లిప్పింగ్లకూ ‘వీ6–వెలుగు’ లోగోను వాడుకున్నారు. ఇట్లా అధికార పార్టీ లీడర్లు ఫేక్ న్యూస్ను క్రియేట్ చేసి హుజూరాబాద్లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు.