బ్రెయిన్ డెడ్.. ఆర్గాన్స్ డొనేట్ కు ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

బ్రెయిన్ డెడ్.. ఆర్గాన్స్ డొనేట్ కు ముందుకొచ్చిన కుటుంబ సభ్యులు

చందానగర్​, వెలుగు: ఓ వృద్ధుడు బ్రెయిన్​ డెడ్​ కావడంతో అతడి అవయవాలు డొనేట్​ చేసేందుకు కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. చందానగర్​ గంగారంలోని శ్రీసాయి గాయత్రి రెసిడెన్సీలో పీతల యెల్లాజిరావు(65) కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ నెల 17న ఇంట్లో స్పృహ కోల్పోయి కింద పడ్డాడు. కుటుంబసభ్యులు లేపి మంచినీరు తాగించడంతో సాధారణ స్థితికి వచ్చాడు. ఉదయం 11.30 గంటలకు వాకింగ్​ కోసమని ఇంటి నుండి బయటకు వచ్చాడు. 

జేపీ సినిమా రోడ్డులో మళ్లీ పడిపోవడంతో గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు యోల్లాజిరావును మదీనగూడలోని ఓ ప్రైవేట్​ దవాఖానకు తరలించారు. అక్కడి  నుంచి జూబ్లీహిల్స్​ అపోలో హాస్పిటల్​కు తరలించగా చికిత్స పొందుతూ 19న రాత్రి బ్రెయిన్​ డెడ్​ అయ్యాడు. ఆయన అవయవాలను దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. జీవన్​దాన్​ ట్రస్ట్​ సభ్యులు అతని కళ్లు, గుండె, లివర్​, కిడ్నీలతో పాటు ఇతర అవయవాలు సేకరించి అవసరం ఉన్నవారికి అమర్చుతామని తెలిపారు.