
రైతు బంధు ఇన్సూరెన్స్ పథకం వర్తింపజేయాలంటూ ఖమ్మం జిల్లా కొణిజర్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు డెడ్ బాడీతో ధర్నా చేశారు రైతు కుటుంబసభ్యులు. పల్లిపాడు రైతు నంద్యాల వీరభద్రయ్యకు తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమి ఎకరం 26 గుంటలు ఉంది. దీనికి సంబంధించి వీరభద్రయ్యకు రైతుబంధు పాసుపుస్తకం కూడా వచ్చింది. అయితే రెవెన్యూ అధికారులు NSP భూమి కలిసిందని పాసుపుస్తకాలను హోల్డ్ లో పెట్టారు. దీనిపై కలెక్టుకు ఫిర్యాదు చేసినా పరిష్కారం కాలేదు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరభద్రయ్య చనిపోయాడు. దీంతో వీరభద్రయ్యకు రైతుబంధు పథకాన్ని వర్తింపజేసి ఇన్సూరెన్స్ ను ఇప్పించాలని తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేశారు కుటుంబ సభ్యులు, బంధువులు. న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.