
గుండెపోటుతో చనిపోయిన వ్యక్తి మృతదేహంతో ప్రయాణించిన ముగ్గురికి కరోనా సోకింది. ఈ ఘటన కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో జరిగింది. మాండ్యాకు చెందిన 56 ఏళ్ల వ్యక్తి ముంబైలో ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. దాంతో ఆయన బంధువులు మహారాష్ట్రలోని అధికారుల అనుమతి తీసుకొని మృతదేహంతో అంబులెన్స్లో మాండ్యాకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత మాండ్యా జిల్లా వైద్యాధికారులు వారికి కరోనా పరీక్షలు చేశారు. ఆరుగురిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ గా తేలింది. చనిపోయిన వ్యక్తి భార్యకు మాత్రం నెగిటివ్ గా వచ్చింది. అయితే వీరందరూ మృతదేహాన్ని తీసుకొని మాండ్యాకు వెళ్లేటప్పుడు దారిలో ఒక మహిళ మరియు ఆమె కుమారుడికి లిఫ్ట్ ఇచ్చారు. వారిద్దరిలో తల్లికి కరోనా సోకింది. మృతదేహాన్ని సొంత జిల్లాకు చేర్చే క్రమంలో మొత్తంగా నలుగురికి కరోనా సోకింది. అయితే చనిపోయిన వ్యక్తి కొడుకు బ్యాంకులో పనిచేసేవాడు. అతనికి కరోనా సోకి.. అతని ద్వారా మిగిలిన ముగ్గురికి సోకినట్లు భావిస్తున్నారు. మాండ్యాలో ఈ నాలుగు పాజిటివ్ కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 14కు చేరింది.
‘ముంబై అధికారులు అంబులెన్స్లో మృతదేహంతో పాటు ఆరుగురికి ఎందుకు అనుమతి ఇచ్చారు. అంతేకాకుండా.. ముంబై లాంటి కంటైనర్ జోన్ నుండి పరీక్షించకుండా ఎలా పంపించారు’అని మాండ్య డిప్యూటీ కమిషనర్ డాక్టర్ ఎంవి వెంకటేష్ అన్నారు. అయితే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి మాత్రం.. ఇది మాండ్యా అధికారుల వైఫల్యమని అన్నారు.
మృతదేహం వచ్చింది మహారాష్ట్ర నుంచి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని మాండ్యా అధికారులు అంటున్నారు. అక్కడ కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. దాదాపు 11 వేలకు పైగా కేసులు నమోదయ్యాయంటే.. అక్కడ కరోనా వ్యాప్తి ఎంత ఎక్కువగా ఉందో దాన్నిబట్టే అర్థం చేసుకోవచ్చని వారు అంటున్నారు.
ఇప్పటివరకు కర్ణాటకలో 589 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 22 మంది చనిపోయారు.
For More News..