బంగ్లాదేశ్ మహిళా ప్లేయర్ ఫర్గానా హోక్ చరిత్ర సృష్టించింది. ఆ దేశం తరుపున వన్డే క్రికెట్ లో తొలి సెంచరీ చేసిన బ్యాటర్గా రికార్డు నెలకొల్పింది. భారత్తో జరుగుతున్న మూడో మ్యాచ్లో ఫర్గానా ఈ మైలురాయిని అందుకుంది. ఓపెనర్ గా బరిలోకి దిగిన ఫర్గానా.. 160 బంతుల్లో 107 పరుగులు చేసింది. ఇందులో 6 ఫోర్లు ఉన్నాయి. 52 ఇన్నింగ్స్ల్లో ఫర్గానా 24.10 సగటుతో 1133 పరుగులు చేసింది.
ఢాకా వేదికగా ఇండియాతో మూడో వన్డేలో బంగ్లాదేశ్ జట్టు ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణిత 50 ఓవర్లలో ఆ జట్టు.. 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఓపెనర్లు షమీమా సుల్తానా, ఫర్గానా హోక్ జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే చెరో మ్యాచ్ లో గెలిచి ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు సిరీస్ ను కైవసం చేసుకోనుంది.