ఘట్కేసర్ వెలుగు: ఏటీఎం వద్ద సహాయం చేస్తామంటూ నమ్మబలికి ఓ రైతును ఇద్దరు దారుణంగా మోసగించారు. మేడ్చల్ జిల్లా అంకుశాపూర్కుచెందిన రైతు బీరెడ్డి రవీందర్ రెడ్డి (50) ఈ నెల 7న ఘట్కేసర్ పరిధి శివారెడ్డిగూడలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంకు మనీ విత్డ్రా చేయడానికి వెళ్లాడు. అక్కడున్న ఇద్దరు దుండగులు సహాయం చేస్తామంటూ మాటలతో అతడిని గందరగోళానికి గురిచేసి చాకచక్యంగా ఏటీఎం కార్డును మార్చేశారు. బాధితుడికి అశోక్ కుమార్ అనే వ్యక్తికి చెందిన వేరే కార్డు ఇచ్చి పరారయ్యారు.
అనంతరం రవీందర్ రెడ్డి ఖాతా నుంచి విడతల వారీగా మొత్తం రూ. 1.15 లక్షల నగదును దోచుకున్నారు. మొబైల్కు వచ్చిన మెసేజ్లను చూసి షాక్కు గురైన బాధితుడు.. తాను మోసపోయానని గ్రహించి ఆదివారం ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
