పెద్దపల్లి జిల్లా కదంబాపూర్​లో పెట్రోల్​ పోసుకున్న రైతు

పెద్దపల్లి జిల్లా కదంబాపూర్​లో పెట్రోల్​ పోసుకున్న రైతు

పెట్రోల్​ పోసుకున్న రైతు
నీళ్లు పోసి కాపాడిన తోటి రైతులు
పెద్దపల్లి జిల్లా కదంబాపూర్​లో ఘటన

పెద్దపల్లి, వెలుగు: వరి కొనుగోలు ఆలస్యం కావడంతో ఓ రైతు పెట్రోల్​పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్​ మండలం కదంబాపూర్ లో ఈ ఘటన జరిగింది. కదంబాపూర్​ గ్రామానికి చెందిన మానుపాటి సమ్మయ్య పది రోజుల క్రితం స్థానిక మార్కెట్​ సెంటర్​లో ధాన్యం పోశాడు. వ్యవసాయాధికారులు చెప్పినట్టుగానే వడ్లను శుభ్రం చేసి కొనుగోలుకు సిద్ధం చేశాడు. కొనుగోలు ఆలస్యం కావడంతో సమ్మయ్య రోజూ ఇల్లు, సెంటర్​ మధ్య తిరుగుతూనే ఉన్నాడు. ఇంకెన్ని రోజులు ఇలా చేస్తారని అధికారులపై అసహనం వ్యక్తం చేశాడు. రోజులాగే మంగళవారం మార్కెట్​కు వెళ్లిన సమ్మయ్య.. తన వడ్లను కొనాలని కోరాడు. అయినా అధికారులు వినలేదు. సంచులు కూడా ఇవ్వలేదు.

మార్కెట్​లో పరపతి ఉన్న రైతులు కాంటా పెట్టించుకుంటుండడంతో తన పరిస్థితి ఏమిటని కలత చెందాడు. దీంతో బాటిల్​లో వెంట తెచ్చుకున్న పెట్రోల్​ను ఒంటిపై పోసుకున్నాడు. గమనించిన చుట్టుపక్కల రైతులు వెంటనే సమ్మయ్యను పక్కకు లాగి ఒంటిపై నీళ్లు పోశారు. తర్వాత  మార్కెట్  సెంటర్​ నిర్వాహకులు సమ్మయ్య ధాన్యంతో పాటు మరి కొంతమంది రైతుల ధాన్యాన్ని కూడా కొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వర్షాలు పడుతుండడంతో తేమ రావడం లేదని, ధాన్యాన్ని రోజూ ఆరబోస్తూ కుప్పలు పోసుకుంటున్నామన్నారు. సెంటర్​ నిర్వాహకులు రైతులపై వివక్ష చూపుతూ గందరగోళం సృష్టిస్తున్నారన్నారు.  వచ్చిన ధాన్యం వచ్చినట్టు కొనాలని కోరుతున్నారు.