
భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ రంగమే వెన్నెముక. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు నేటికీ వ్యవసాయమే ప్రధాన జీవనాధారం. ప్రజలకు ఉపాధి కల్పించడంలో వ్యవసాయ రంగమే అగ్రగామిగా నిలుస్తోంది. 2023-–-24లో 46.1 శాతం మందికి వ్యవసాయ రంగమే ఉపాధి కల్పించిందని ఆర్థిక సర్వే లెక్కలు చెబుతున్నాయి. కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 2002–-23లో భారతదేశ జీడీపీలో వ్యవసాయరంగం వాటా 18 శాతంగా నమోదైంది. దేశంలో140 కోట్ల జనాభాకు తగిన ఆహార భద్రత కల్పించి, పేదరికం నిర్మూలించడంలో వ్యవసాయరంగం పాత్ర ఎనలేనిది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు గడుస్తున్నా రైతుల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా తయారైంది. వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వాల విధానాలు, నూతన ఆర్థిక సంస్కరణల ప్రభావంతో వ్యవసాయరంగం రోజురోజుకూ కునారిల్లిపోతోంది. అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు, చీడపీడలు, దిగుబడులు పడిపోవడం, కూలీల ఖర్చు పెరిగిపోవడం, పండిన పంటలకు గిట్టుబాటు ధర లభించకపోవడం, రుణభారంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
నైరాశ్యంలో రైతాంగం
వ్యవసాయ పంట ఉత్పత్తులకు కనీస మద్దతు ధరల పేరుతో అన్నదాతలను కేంద్ర ప్రభుత్వం మళ్లీ నైరాశ్యంలోకి నెట్టేసింది. కేంద్ర మంత్రివర్గం 2025– -26 ఖరీఫ్ కాలానికి 14 పంటలకు ప్రకటించిన కనీస మద్దతు ధరలు రాష్ట్ర రైతాంగానికి భరోసా ఇవ్వలేకపోయాయి. కౌలు, ఎరువులు, విత్తనాలు, పంట కోత, రవాణా, వృథా, ఇంధనం, కూలి ఖర్చులు లెక్కకట్టి కనీస మద్దతు ధరలను నిర్ణయించినట్టు కేంద్ర సమాచారశాఖ మంత్రి ప్రకటించటం.. క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితులకు పూర్తి విరుద్ధంగా ఉంది. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులకు ప్రకటించిన పంటల కనీస మద్దతు ధరలకు పొంతనే లేకుండా పోయింది.
రాష్ట్ర సిఫార్సులను పరిగణించలేదు
వివిధ పంటలకు రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన కనీస మద్దతు ధరలను జాతీయ వ్యవసాయ ఖర్చులు, ధరల కమిషన్ (సీఏసీపీ) పరిగణనలోకి తీసుకోలేదు. వరి సాధారణ రకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 3000 సిఫారసు చేస్తే కేంద్రం రూ.2369 మాత్రమే కనీస మద్దతు ధరగా ప్రకటించింది. ఏ గ్రేడ్ వరి రకానికి తెలంగాణ ప్రభుత్వం రూ.3200 సూచిస్తే రూ.2389గా నిర్ధారించింది. అదేవిధంగా పత్తి మధ్య రకానికి రూ.8121గాను రూ.7710, పొడవు పింజ రకానికి రూ. 8521గాను రూ.8110, మొక్కజొన్న రూ.2900 సూచిస్తే రూ.2400, వేరుశనగ రూ.8000గాను రూ.7263, కందులు రూ.9200గాను రూ.8000, పెసలు రూ.9000 రాష్ట్ర ప్రభుత్వం సూచిస్తే 8768 రూపాయల కనీస మద్దతు ధరగా కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో సన్న వరి రకానికి రూ.500 బోనస్గా ఇస్తున్న పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ధాన్యానికి కిలోకు 69 పైసలు మాత్రమే పెంచడాన్ని రైతులు ఆక్షేపిస్తున్నారు. స్వామి నాథన్ కమిటీ సిఫారసులను అమలు చేస్తామని, 2022 నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తామని మోదీ సారథ్యంలోని బీజేపీ 2014 ఎన్నికల ప్రణాళికలో ప్రకటించి అధికారంలోకి వచ్చింది. ఆ దిశలో కార్యాచరణ మాత్రం కానరావడం లేదు.
స్వామినాథన్ సిఫార్సు అమలుచేయాలి
కనీస మద్దతు ధరల విషయంలో C2 (కాంప్రహెన్సివ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్) + 50 శాతం ఫార్ములాను అమలు చేయాలని స్వామినాథన్ చేసిన ప్రధానమైన సిఫార్సు నేటికీ అమలు కాలేకపోతోంది. రైతులు చెల్లించిన పంట వ్యయాలు, కుటుంబ శ్రమ విలువ, సొంత మూలధన ఆస్తుల విలువపై వడ్డీ, భూమికి చెల్లించిన కౌలు, సొంతభూమికి కౌలు విలువ మొదలగు వ్యయాలను స్వామినాథన్ C2 గా పరిగణించారు. MSPలో C2 + 50 శాతం ఫార్ములా అమలు చేయాలని 2006లోనే ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా అమలులోకి రాలేకపోతోంది. C2కి 50 శాతం అదనపు మొత్తాన్ని సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వం సూచిస్తున్న ధరలనే సీఏసీపీ మద్దతు ధరల పేరుతో కేంద్రానికి సిఫార్సు చేయడం, దానిని కేంద్రం ఆమోదించటం ఓపద్ధతి ప్రకారం జరుగుతోందన్న విమర్శలు ఉన్న నేపథ్యంలో కమిషన్ ఫర్ అగ్రికల్చరల్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ (సీఏసీపీ) క్షేత్రస్థాయిలో పంటలకయ్యే ఖర్చును శాస్త్రీయంగా లెక్కగట్టి మద్దతు ధరలను కేంద్రానికి సిఫారసు చేయాలి. మద్దతు ధరకు సమాన స్థాయిలో బహిరంగ మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల ధరలను ఉంచడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు ఎంఎస్పీకి మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం విధిగా చెల్లించాలి. ఎఫ్సీఐ, సీసీఐ, నాఫెడ్, మార్క్ ఫెడ్ లాంటి ప్రభుత్వరంగ కొనుగోలు సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
- బిల్లిపెల్లి లక్ష్మారెడ్డి