V6 News

మిడిల్ క్లాస్ ఆదాయం పెరిగినా డబ్బులు చేతిలో నిలవకపోవడానికి కారణాలివే..

మిడిల్ క్లాస్ ఆదాయం పెరిగినా డబ్బులు చేతిలో నిలవకపోవడానికి కారణాలివే..

2021లో సుమారు ఆరు బిలియన్ డాలర్లుగా ఉన్న లగ్జరీ మార్కెట్ 2024 నాటికి ఎనిమిది నుంచి తొమ్మిది బిలియన్ డాలర్ల స్థాయికి చేరిందని అంచనాలు సూచిస్తున్నాయి. 2028 నాటికి ఇది  పద్నాలుగు నుంచి  పదిహేను  బిలియన్ డాలర్లను దాటవచ్చని  భావిస్తున్నారు.  ముఖ్యంగా మిడిల్ క్లాస్  కొనగలిగే  ప్రీమియం ఉత్పత్తులు ఈ వృద్ధికి  ప్రధాన ఇంధనం. లగ్జరీ వినియోగంలో అరవై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు ‘అస్పైరేషనల్  మిడిల్  క్లాస్’ నుంచే వస్తోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

స్మార్ట్​ఫోన్  మార్కెట్‌‌లో ఇది మరింత స్పష్టంగా కనిపిస్తోంది.  ముప్పై వేల రూపాయల పైన ప్రీమియం ఫోన్ల విభాగం గత  మూడు సంవత్సరాల్లో వేగంగా పెరిగింది. అలాగే పది లక్షల రూపాయల పైన కార్ల విక్రయాలు  ప్యాసింజర్ వెహికల్ మార్కెట్‌‌లో సగానికి పైగా వాటా సాధించాయి. అవసరాల ఆధారిత కొనుగోళ్ల కంటే, గుర్తింపు ఆధారిత కొనుగోళ్లు  పెరుగుతున్నాయని  ఇది స్పష్టం చేస్తోంది. ఈ వినియోగ  విస్ఫోటానికి అసలు ఇంధనం.. సులభ రుణ వ్యవస్థ. 

తాజాగా 2026 మార్చి నాటికి దేశంలో క్రెడిట్ కార్డ్ ఖర్చు ఒక్క నెలలోనే  రెండు లక్షల పంతొమ్మిది వేల కోట్ల రూపాయలకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తంలో క్రెడిట్ కార్డ్ వ్యయం ఇరవై మూడు లక్షల అరవై రెండు వేల కోట్ల రూపాయలకు  చేరింది. యాక్టివ్ క్రెడిట్ కార్డుల సంఖ్య పదకొండు కోట్ల ఎనభై ఆరు లక్షలకు చేరింది.  ఇది వినియోగ శక్తి పెరిగిందనే సంకేతం  మాత్రమే కాదు.

అప్పుపై ఆధారపడే జీవనశైలి విస్తరించిందనే హెచ్చరిక కూడా. రిజర్వ్ బ్యాంక్  గణాంకాల  ప్రకారం 2025  మార్చి నాటికి  భారత కుటుంబాల అప్పు స్థూల దేశీయోత్పత్తిలో నలభై ఒకటి శాతానికి పైగా చేరింది. గత  ఐదేళ్ల  సగటుతో  పోలిస్తే ఇది ఎక్కువ. ముఖ్యంగా వ్యక్తిగత రుణాలు, క్రెడిట్ కార్డులు,  వినియోగ రుణాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం.  అంటే అప్పు  ఇప్పుడు ఆస్తి లేదా సంపద పెరగడానికి ఉపయోగించే  కంటే  వినియోగానికి   ఎక్కువగా  వెళ్తోంది. ఆర్థిక  ఒత్తిడి ప్రమాదకరంగా మారుతున్నది.

ఈఎంఐ బంధనాలు
పొదుపు అనే భావన  పూర్తిగా  కనుమరుగవుతోంది. ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, కుటుంబ అత్యవసరం..  ఏ  చిన్న షాక్ వచ్చినా మొత్తం ఆర్థిక నిర్మాణం కూలిపోతుంది. ఈఎంఐలు  మొదట  సౌకర్యంగా కనిపిస్తాయి. కానీ, ఆ తర్వాత అవే బంధనాలవుతాయి.  సోషల్ మీడియా ఈ మానసిక  ఒత్తిడిని  మరింత పెంచుతోంది. ఇన్‌‌స్టాగ్రామ్, యూట్యూబ్‌‌లో  కనిపించే లగ్జరీ జీవితం చాలామందికి తమ వాస్తవ జీవితాన్ని తక్కువగా అనిపించేలా చేస్తోంది.  వినియోగం ఆర్థిక నిర్ణయం కాకుండా మానసిక ప్రతిస్పందనగా మారుతోంది. కంపెనీలు కూడా ఇదే బలహీనతను  వ్యూహంగా ఉపయోగిస్తున్నాయి.

‘నో కాస్ట్ ఈఎంఐ’, ‘జీరో డౌన్ పేమెంట్’, ‘ఇన్‌‌స్టంట్ లోన్ అప్రూవల్’, ‘బై నౌ పే లేటర్’.. ఇవి  మార్కెటింగ్ పదాలు మాత్రమే కాదు. భవిష్యత్ ఆదాయాన్ని ముందుగానే ఖర్చు చేయించే  పద్ధతులు. మరో వైపు కుటుంబాల పొదుపు రేటు కూడా స్థిరంగా లేదు. సంపాదన పెరిగినా, అప్పు వేగం కూడా పెరుగుతోంది. చేతిలోకి వచ్చే డబ్బు పెరిగినంత వేగంగానే బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. ఫలితంగా, మిడిల్ క్లాస్ ఆదాయం పెరిగినా వారిలో ఆర్థిక భద్రత మాత్రం పెరగడం లేదు.

పొదుపుతో దీర్ఘకాల భద్రత
దేశ ఆర్థిక వ్యవస్థపై దీని ప్రభావం ద్వంద్వ స్వరూపం కలిగి ఉంది. ఒకవైపు ప్రైవేట్ వినియోగం స్థూల దేశీయోత్పత్తిలో యాభై ఐదు నుంచి అరవై శాతం వరకు వాటా కలిగి ఉండటం వల్ల వినియోగం పెరగడం వృద్ధికి  దోహదపడుతుంది. మరోవైపు కుటుంబాల పొదుపు బలహీనపడితే, భవిష్యత్ పెట్టుబడి సామర్థ్యం తగ్గుతుంది. వినియోగంతో నడిచే వృద్ధి తక్షణ లాభం ఇస్తుంది. పొదుపుతో నడిచే వృద్ధి దీర్ఘకాల భద్రత ఇస్తుంది. భారత మిడిల్ క్లాస్ ప్రస్తుతం ఈ రెండింటి మధ్య  ప్రమాదకర సమతౌల్యంలో నిలిచింది. సమస్య లగ్జరీలో లేదు. సామర్థ్యానికి మించిన లగ్జరీలో ఉంది.

సాధారణ ఆర్థిక సూత్రం ప్రకారం ఈఎంఐలు ఆదాయంలో ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం మించకూడదు.  కనీసం ఇరవై శాతం ఆదాయం పొదుపు కావాలి. కానీ వాస్తవంలో అనేక  కుటుంబాలు దీనికి పూర్తి విరుద్ధ దిశలో సాగుతున్నాయి. ఆర్థిక స్వేచ్ఛ అనేది ఎక్కువ  సంపాదించడం వల్ల కాదు. నియంత్రిత  ఖర్చు వల్ల వస్తుంది.

మొత్తానికి  లగ్జరీ మాయలో మిడిల్ క్లాస్ పడిపోవడం వ్యక్తిగత వైఫల్యం కాదు. ఇది ఒక వ్యవస్థాత్మక పరిణామం. మార్కెట్ వ్యూహాలు, సోషల్ మీడియా ఒత్తిడి,  తక్షణ రుణ వ్యవస్థలు  కలిసి నిర్మించిన కొత్త వాస్తవం ఇది. కానీ మార్గం ఇంకా స్పష్టంగానే ఉంది. ఆర్థిక అవగాహన, క్రమశిక్షణ, బయట ప్రపంచానికి ధనవంతుల్లా కనిపించడం కంటే,  కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండటమే  గొప్ప విజయం అవుతుంది.

శ్రీనివాస్ గౌడ్ ముద్దం

  • ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ఐడీ openpage@v6velugu.com
  • రచయితలు ‘వెలుగు’కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి.
  • స్వీయ రచన అయి ఉండాలి. రచన 700 పదాలకు మించరాదు.