ధరణి పోర్టల్‌ తో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు

ధరణి పోర్టల్‌ తో రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారు

ధరణి పోర్టల్‌ ద్వారా రైతులు, ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి చెప్పారు. రైతు నిశ్చింతగా ఉండాలని కొత్త రెవెన్యూ యాక్ట్‌ తీసుకువచ్చినట్లు తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో రెవెన్యూ పద్దు ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ధరణి పోర్టల్‌ తీసుకురావడం రైతులకు సీఎం ఇచ్చిన వరమని అన్నారు. ఇది సీఎం కేసీఆర్‌ చారిత్రాత్మక, సాహసోపేతమైన చర్య అన్నారు. భూముల అమ్మకాలు, కొనుగోళ్లు ధరణి పోర్టల్‌ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. గతంలో రిజిస్ట్రేషన్‌ అయ్యాక మ్యుటేషన్‌ జరగడానికి రెండు మూడు సంవత్సరాలు తిరిగిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. రిజిస్ట్రేషన్‌ కోసం తన భార్య వెళ్తే 15 నుంచి 20 నిమిషాల్లోనే అయిపోయిందని, రిజిస్ట్రేషన్​తోపాటు ఆమె పేరు మీద ఈ పాస్‌బుక్‌ ఇచ్చారని తెలిపారు. ఇప్పటిదాకా 2.48 కోట్ల భూ రికార్డులను పరిశీలించినట్లు చెప్పారు. వాటిలో 1.48 కోట్ల ఎకరాలకు 60 లక్షల మంది రైతులకు కొత్త పాస్‌ బుక్కులు ఇచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం 541 తహసీల్దార్‌ ఆఫీసులను సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులుగా మార్చామని తెలిపారు. సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల ద్వారా గత ఏడాది 15.34 లక్షల లావాదేవీల్లో 6,680 కోట్ల ఆదాయాన్ని పొందామని తెలిపారు.

కరోనాను ఎదుర్కొనేందుకు 4,890 కోట్లు ఖర్చు

కరోనాను ఎదుర్కొనేందుకు రూ.4,890 కోట్లు వెచ్చించామని, రూ.720 కోట్లు వరదల సందర్భంగా ఖర్చు చేశామని వేముల ప్రశాంత్​రెడ్డి చెప్పారు. 6 వేల కోట్లు కావాలని కేంద్రాన్ని కోరితే రూ.240 కోట్లు ఇస్తామని చెప్పి.. ఇప్పటిదాకా అది కూడా విడుదల చేయలేదని విమర్శించారు. డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లను ఫ్రీగా కట్టిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వేముల చెప్పారు. రూ.18,880 కోట్లతో మొత్తం 2.86 లక్షల డబుల్‌ ఇండ్లు మంజూరు చేశామని, ఇప్పటిదాకా 2.21 లక్షల ఇండ్లకు టెండర్లు పిలిచామని చెప్పారు.