
- నడిగడ్డలో -3.65 లక్షల ఎకరాల్లో పంటల సాగు
గద్వాల, వెలుగు: నడిగడ్డలో వానకాలం సాగుకు రైతన్నలు సన్నద్ధమవుతున్నారు. పంట పొలాలతో పాటు విత్తనాలు, ఎరువులు రెడీ చేసుకుంటున్నారు. జోగులాంబ జిల్లాలో ఈ ఏడాది 3.65 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అగ్రికల్చర్ ఆఫీసర్లు అంచనా వేశారు. అందుకు అనుగుణంగా విత్తనాలు, ఎరువులు రెడీ చేశారు. ఓ వైపు వర్షాలు పడుతుండడం, మరోవైపు జూరాల ప్రాజెక్టు కింద రైట్ కెనాల్ కు నీళ్లు వదలడంతో రైతులు పొలం పనుల్లో బిజీ అయ్యారు.
ఇక వానాకాలం ప్రారంభంలోనే వర్షాలు కురవడంతో కూలీలకు డిమాండ్ పెరిగింది. ఎండాకాలంలో మహిళా కూలీలకు రూ.300 వరకు చెల్లించగా, ప్రస్తుతం రూ.400 వరకు చెల్లిస్తున్నారు. సీడ్ పత్తి క్రాసింగ్ స్టార్ట్ అయితే రూ.800 వరకు కూలీ రేట్లు పెరుగుతాయని రైతులు చెబుతున్నారు. ఇప్పటికే సీడ్ పత్తి సాగు చేస్తున్న రైతులు కూలీలకు అడ్వాన్సు చెల్లించి, తమ చేలల్లో పనికి రావాలని బుక్ చేసుకుంటున్నారు.
3.67 లక్షల ఎకరాల్లో పంటల సాగు..
జోగులాంబ గద్వాల జిల్లాలో 3.67 లక్షల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. 96 వేల ఎకరాల్లో వరి, 43 వేల ఎకరాల్లో కంది, 1.42 లక్షల ఎకరాల్లో కమర్షియల్ పత్తి(కాటన్), 33 వేల ఎకరాల్లో మిరప, 13 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 11 వేల ఎకరాల్లో వేరుశనగ, 11 వేల ఎకరాల్లో కూరగాయలు, పండ్లతోటలు, 21 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పంటల సాగుకు 36,078 మెట్రిక్ టన్నుల యూరియా, 13,234 మెట్రిక్ టన్నుల డీఏపీ, 6,815 మెట్రిక్ టన్నుల పొటాష్, 6,615 మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్పేట్, 55,842 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరం అవుతాయి. ఇప్పటికే 15,442 మెట్రిక్ టన్నుల యూరియా, 1,694 మెట్రిక్ టన్నుల డీఏపీ, 759 మెట్రిక్ టన్నుల సూపర్ ఫాస్పేట్, 1,738 టన్నుల పొటాష్, 18,009 మెట్రిక్ టన్నుల కాంప్లెక్స్ ఎరువులు సిద్ధంగా ఉన్నట్లు డీఏవో సక్రియా నాయక్ తెలిపారు.