- షాపుల్లో రైతుల వివరాలు నమోదు చేస్తున్న డీలర్లు
- రైతు పేరు, సర్వే నంబర్ వంటి వివరాలు నమోదు
- విత్తనాలు బయట కొంటే సెల్ఫ్ డిక్లరేషన్
యాదాద్రి/జనగామ, వెలుగు: సన్న వడ్లకు ప్రభుత్వం అందించే బోనస్ పక్కదారి పట్టకుండా అధికారులు చర్యలు చేపడుతున్నారు. పంట వివరాలను రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతులకే బోనస్ అందించనున్నారు.
సన్న రకాలనే సాగు చేస్తున్న రైతుల వివరాలను విత్తన డీలర్ల వద్ద నమోదు చేయడంతో పాటు డిజిటల్ క్రాప్ సర్వేలోనూ నమోదు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు లేదా నారు తెచ్చుకునే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత వివరాలను సివిల్ సప్లయ్స్ శాఖకు అందించి, క్రాస్ చెక్ చేయనున్నారు.
పాస్బుక్.. విత్తన రకాలు
వానాకాలం 2026–27 సీజన్లో ఏడు రకాల సన్నాలకు బోనస్ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొందరు దళారులు, వ్యాపారులు రైతుల నుంచి ముందుగానే తక్కువ ధరకు సన్న వడ్లు కొనుగోలు చేసి, కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి బోనస్ పొందే అవకాశం ఉండటంతో ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేస్తోంది.
వరి విత్తనాలు కొనుగోలు చేసే సమయంలోనే డీలర్లు రైతుల పట్టాదారు పాస్బుక్ వివరాలను నమోదు చేస్తున్నారు. రైతు పేరు, సర్వే నంబర్, కొనుగోలు చేసిన విత్తన రకం వంటి వివరాలను రికార్డు చేస్తున్నారు.
డిజిటల్ క్రాప్ సర్వేలోనూ నమోదు..
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ క్రాప్ సర్వే(డీసీఎస్) కొనసాగుతోంది. ఈసారి ఏఈవోలతో కాకుండా వలంటీర్లతో సర్వే నిర్వహిస్తున్నారు. ఒక్కో వలంటీర్కు 4,500 ఫామ్ ఫీల్డ్లు కేటాయించారు. ప్రతి ఫామ్ ఫీల్డ్కు 20 మీటర్ల దూరంలోకి వెళ్లిన తర్వాతే డీసీఎస్ యాప్ ఓపెన్ అవుతుంది. రైతులు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారనే వివరాలతో పాటు దొడ్డు, సన్న రకాల్లో ఏ విత్తనాలను సాగు చేస్తున్నారో నమోదు చేస్తున్నారు. ఈ ప్రక్రియ వచ్చే నెల 10 వరకు కొనసాగనుంది.
నారు తెచ్చుకుంటే సెల్ఫ్ డిక్లరేషన్..
స్థానిక డీలర్ వద్ద కాకుండా అగ్రికల్చర్ యూనివర్సిటీ లేదా ఇతర ప్రాంతాల నుంచి విత్తనాలు తెచ్చుకున్న రైతుల వివరాలను ఆన్లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్లో ఏవోలు నమోదు చేయనున్నారు. రైతులు ఎవరి వద్ద నుంచి, ఏ రకం సన్న విత్తనాలు తెచ్చుకున్నారో వివరాలు ఇవ్వాలి. విత్తనాలు కాకుండా ఇతర రైతుల నుంచి నారు తెచ్చుకున్నా ఏ రకం విత్తనాల నారు తీసుకున్నారో సెల్ఫ్ డిక్లరేషన్లో పేర్కొనాలి. ఈ వివరాలను ఏవోలు ఆన్లైన్లో అప్లోడ్ చేయనున్నారు.
సివిల్ సప్లయ్స్ క్రాస్ చెక్..
డిజిటల్ క్రాప్ సర్వే, సెల్ఫ్ డిక్లరేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రైతుల సాగు వివరాలను వ్యవసాయ శాఖ సివిల్ సప్లయ్స్ శాఖకు అందించనుంది. ఆ తర్వాత విత్తన డీలర్ల వద్ద నమోదైన వివరాలు, డీసీఎస్ వివరాలను సివిల్ సప్లయ్స్ అధికారులు క్రాస్ చెక్ చేయనున్నారు.
సెల్ఫ్ డిక్లరేషన్ను కూడా పరిశీలిస్తారు. కొనుగోలు కేంద్రానికి రైతులు వచ్చినప్పుడు వారి వివరాలతో పాటు వడ్ల రకాన్ని పరిశీలిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు సన్న రకాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారణ అయితేనే బోనస్ జాబితాలో రైతు పేరును చేరుస్తారు. ఇతర రకాల వడ్లకు బోనస్ ఇవ్వరు.
బోనస్కు అర్హత గల సన్న రకాలివే..
- ఆర్ఎన్ఆర్ 15048
- కేఎన్ఎం 1638
- జైశ్రీరామ్
- కేఎన్ఎం 7715
- బీపీటీ 5204
- హెచ్ఎంటీ సోనా
- డబ్ల్యూజీఎల్ 44
