
ధాన్యం కొనుగోలులో మతకు అన్యాయం జరుగుతుందంటూ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రైతులు ఆందోళన బాటపట్టారు. తడిసిని ధాన్యం కొనడం లేదని.. తరుగు పేరుతో దోచుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో మే 15వ తేదీ సోమవారం రైతులు రోడ్డెక్కారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల విశ్వనాధపురం గ్రామంలో అన్నదాతల ఆందోళన దిగారు. ఐకేపీ కొనుగోలు కేంద్రంలో తరుగు పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం రోడ్డుపై పోసి దహనం చేసి నిరసన తెలిపారు రైతులు.
మరో చోట.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలో కరీంనగర్–వరంగల్ రహదారిపై రైతుల ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకంలో 5 కిలోల కోత విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, తహశీల్దార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తహశీల్దార్ కు వారి సమస్యలను వివరించారు రైతులు. వెంటనే స్పందించిన తహశీల్దార్ రైతులకు నచ్చజెప్పారు.