పత్తి రైతుల రాస్తారోకో.. కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని డిమాండ్

పత్తి  రైతుల రాస్తారోకో..  కొనుగోలు కేంద్రాలు  తెరిపించాలని డిమాండ్

హాలియా, వెలుగు: పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని సోమవారం నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామంలో  దేవరకొండ రహదారిపై రైతులు ఎడ్ల బండ్ల పై తెచ్చిన పత్తి మూటలతో రాస్తారోకో నిర్వహించారు.  ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..  పత్తి కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించి, మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో, ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరలకు పత్తిని కొనుగోలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు. 

సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో సమస్యల కారణంగా, రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకు అమ్ముకోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పత్తిని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేయకపోతే తమకు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని, అధికారులు స్పందించి పత్తి కొనుగోలు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. రైతుల ఆందోళనతో రహదారిపై ట్రాఫిక్‌‌‌‌కు అంతరాయం ఏర్పడింది. అధికారుల హామీతో రైతులు ధర్నా విరమించారు.