
అల్లాదుర్గం, వెలుగు: మండలంలోని గడి పెద్దాపూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూకంవేసి నెల రోజులు గడుస్తున్నా రైస్ మిల్లులకు తరలించడంలేదని గురువారం 161వ జాతీయ రహదారిపై రైతులు నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ.. ఓ వైపు వర్షాలతో ధాన్యం తడుస్తుంటే మరోవైపు అధికారులు తేమ పేరిట ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు ధాన్యం తరలించేందుకు అదనంగా లారీలను అందుబాటులోకి తెచ్చామని చెబుతున్నప్పటికీ మండల అధికారులు లారీల కొరత ఉందని చెప్పడంతో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించి డబ్బులు అకౌంట్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడి లారీల కొరత లేకుండా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
సర్వీస్ రోడ్డు మూసేయొద్దని రైతుల ఆందోళన
రామాయంపేట, వెలుగు: రామాయంపేట బైపాస్ రోడ్డులో గోల్పర్తి రైతులు గురువారం ఆందోళన చేపట్టారు. సర్వీస్ రోడ్డు మూసివేస్తే మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటామని హెచ్చరించారు. పట్టణ శివారులోని ఆధ్య హోటల్ సర్కిల్ వద్ద నేషనల్ హైవే అధికారులు సర్వీస్ రోడ్డు ను మూసివేసేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న గోల్పర్తి, రామాయంపేట రైతులు అక్కడకు చేరుకుని సర్వీస్ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. ఇది మూసి వేస్తే పంట పొలాలకు వెళ్లేందుకు దారి ఉండదని, తాము ఎలా జీవించేదని ప్రశ్నించారు.
సర్వీస్ రోడ్డు ఉంచడంతో పాటు సర్కిల్ లో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. సుమారు గంట పాటు ఆందోళ కొనసాగింది. విషయాన్ని ఎమ్మెల్యే రోహిత్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన నేషనల్ హైవే అధికారులతో మాట్లాడారు. రైతులకు తగిన న్యాయం చేస్తామన్న హామీ మేరకు ఆందోళన
విరమించారు.