- హనుమకొండ జిల్లా కమలాపూర్లో ఎస్సై కాళ్లు మొక్కిన మహిళా రైతు
కమలాపూర్ (ఎల్కతుర్తి)/భీమదేవరపల్లి, వెలుగు : మక్కలను వెంటనే కొనాలని కోరుతూ హనుమకొండ జిల్లా కమలాపూర్లో రైతులు బుధవారం రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో అకాల వర్షం కారణంగా చేతికొచ్చిన పంట నీళ్లపాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలియకపోవడంతో కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నామని వాపోయారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో మక్కల కొనుగోళ్లు వెంటనే జరిగేలా చూడాలంటూ ఓ మహిళా రైతు ఎస్సై కాళ్లపై పడింది. అలాగే భీమదేవరపల్లి మండలం మాణిక్యాపూర్ గ్రామంలోనూ రైతులు ఆందోళనకు దిగారు. ఆన్లైన్ విధానాన్ని తీసేసి పాత పద్ధతిలోనో ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆన్లైన్ విధానం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఆన్లైన్ విధానం కారణంగా కొనుగోళ్ల తర్వాత.. 75 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోందని, దీని వల్ల రవాణా ఖర్చులు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాత పద్ధతిలోనే టోకెన్ల ద్వారా స్థానిక మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు.

