జాతీయ జెండాలతో రేపు దేశవ్యాప్తంగా రైతుల నిరసన ర్యాలీలు

జాతీయ జెండాలతో రేపు దేశవ్యాప్తంగా రైతుల నిరసన ర్యాలీలు

దేశ వ్యాప్తంగా రేపు(ఆదివారం) అన్ని తాషీల్, బ్లాకు స్థాయిలో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. భారత 75 వ ఇండిపెండెన్స్ డే ను తాము కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివస్ గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలంటూ అన్నదాతలు కొంత కాలంగా నిరసనలు చేస్తూనే ఉన్నారు.

హర్యానాలో 5 వేల ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తామని..జింద్ జిల్లాలో భారీ ఎత్తున జరిగే ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కూడా పాల్గొంటారని భారతీయ కిసాన్ యూనియన్ తెలిపింది. పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఈ మార్చ్ కి హాజరవుతారని చెప్పింది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆందోళన కొనసాగుతుందని నేతలు తెలిపారు.  ఢిల్లీ శివారులోని మూడు బోర్డర్లలో జాతీయ జెండాలతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయన్నారు. అయితే ఢిల్లీ నగరంలో ప్రవేశించబోమన్నారు.

అయితే కొన్ని రైతు సంఘాలు హఠాత్తుగా నగరంలోకి ప్రవేశించి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవచ్చే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.