పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం

పల్లెల్లోనూ మార్కెట్లు పెరిగితేనే రైతులకు లాభం
అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసనలు చేస్తున్న రైతులతో ఇప్పటి వరకు ఏడు సార్లు కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినా ప్రయోజనం కనిపించడం లేదు. కొత్త చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆ చట్టాలు రైతులకు మంచి చేసేందుకు తెచ్చినవని, వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదని కేంద్రం చెబుతోంది. దీంతో ఈ చిక్కుముడి వీడట్లేదు. కేంద్రం మాత్రం ఇప్పటికే 50% సమస్య పరిష్కారం అయిపోయిందన్న ప్రచారాన్ని తెరపైకి తెస్తోంది. ఇటీవలే జరిగిన చర్చల్లో రైతులు పెట్టిన రెండు డిమాండ్లకు మోడీ సర్కారు ఓకే చెప్పింది. వాటిలో ఒకటి రైతులకు విద్యుత్ సబ్సిడీల కొనసాగింపు, రెండు పంట తుక్కు తగలబెట్టిన రైతులకు పొల్యూషన్ కంట్రోల్ చట్టాల కింద శిక్షలు వేయకపోవడం. కానీ అసలు సమస్య అలానే మిగిలి ఉందన్న విషయం కేంద్రం మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది. మూడు అగ్రి చట్టాలను రద్దు చేయడం, కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కి చట్టబద్ధత కల్పించడం అనేవి రైతుల మేజర్ డిమాండ్స్ అన్న విషయాన్ని సైడ్ ట్రాక్ చేయడం అసాధ్యం. తమ డిమాండ్ల సాధన కోసం ఢిల్లీలో నిరసనలు తెలుపుతూ అక్కడ తీవ్రమైన చలికి, ఆత్మహత్యలు చేసుకుని 40 మందికి పైగా రైతులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో కేంద్రం ఈ విషయాన్ని సీరియస్‌‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. సాగులో సంస్కరణలు రావాల్సిందే, కానీ.. వ్యవసాయ సంస్కరణల ద్వారా రైతులకు మేలు జరుగుతుందని మోడీ సర్కార్ చెబుతోంది. సాగులో కచ్చితంగా సంస్కరణలు రావాల్సిందే. కానీ కేంద్రం హర్రీబర్రీగా ఈ చట్టాలను చేయడం వల్లే సమస్య మొదలైంది. ఆర్డినెన్సులు తెచ్చి ఆ తర్వాత, పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఎటువంటి చర్చ లేకుండావాటిని ఆమోదించేశారు. అలా కాక ఆ చట్టాల వల్ల ప్రభావం పడే అన్ని వర్గాలతో సంప్రదింపులు జరిపి, వాటిని తీసుకొచ్చి ఉంటే బావుండేది. కానీ మోడీ ప్రభుత్వం అంతా రివర్స్ లో చేస్తోంది. చట్టాలు తేవడానికి ముందు జరపాల్సిన చర్చలు, వాటిని ఆమోదించిన తర్వాత మొదలుపెట్టింది. అదే క్లాజుల వారీగా బిల్లుల తయారీ సమయంలో, పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు చర్చించి, అవసరమైన సవరణలు చేసి చట్టాలపై ఆమోద ముద్ర వేసుంటే ఏ సమస్య ఉండేది కాదు. బడ్జెట్ సెషన్‌‌లో చర్చకు.. ప్రస్తుతం అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు పోరాటం చేస్తున్న సమయంలో కేంద్రం మొండిగా ముందుకెళ్తే.. వాటిని బలవంతంగా రైతులపై రుద్దినట్టే అవుతుంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎక్కువ కాలం నిలవాలనుకునే ప్రభుత్వాలకు మంచిది కాదు. ఆ చట్టాలపై చర్చలకు పిలిచే బదులుగా, రైతుల డిమాండ్లను ఆమోదిస్తే వారిని నిరసనలు విరమింప చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు మంచి సందేశం పంపినట్లవుతుంది. ప్రజల ఆందోళనను అర్థం చేసుకుని ప్రభుత్వం వెనక్కి తగ్గడం తప్పేంకాదు. ఆ నిరసనల్లో మరింత మంది రైతులు ప్రాణాలు కోల్పోతే అది ప్రభుత్వానికే చెడ్డ పేరు. దీని దృష్టిలో పెట్టుకుని చట్టాలను వెనక్కి తీసుకుని, వాటిని మళ్లీ ఈ నెలాఖరులో మొదలయ్యే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టి, లోతుగా చర్చించి ఆమోదించడం ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది. అన్ని పంటలకూ ఎంఎస్పీ ప్రకటించాలె మార్కెట్లను చిన్న, సన్నకారు రైతులకు సైతం దగ్గర చేసి కనీస మద్దతు ధర ఇచ్చే విషయంలో భరోసా కల్పించడం ద్వారా రైతుల నిరసనలను విరమింపచేయొచ్చు. అలాగే ప్రస్తుతం వరి, గోధుమ, సోయాబీన్స్, పత్తి లాంటి పంటలకే ప్రభుత్వం ఎంఎస్పీ ఇస్తోంది. అయితే అన్ని పంటలకూ మద్దతు ధరను ప్రకటించాల్సిన అవసరం ఉంది. అలాగే ఆయా పంటలను పండించడానికి అయ్యే ఖర్చు, ఏటా మారే పరిస్థితులను బట్టి ఆ ఎంఎస్పీని పెంచాలి. రైతు ఆదాయం డబుల్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గం ఇదే. కానీ ఎంఎస్పీ సిస్టమ్‌‌ను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఇప్పుడు దానిని నెమ్మదిగా తొలగించే ఆలోచన చేయడం సరైన విధానం కాదు. కార్పొరేట్లను పంట కొనుగోలుకు అనుమతించి, వారితో రైతులు ధర విషయంలో బేరమాడి మంచి రేటుకు అమ్ముకోవచ్చని చెప్పడం అవివేకమే. కార్పొరేట్లు వారి లాభాల కోసం ఏమైనా చేయగలరన్న విషయాన్ని గుర్తించాలి. దానికంటే ప్రభుత్వమే నేరుగా రైతులు ఒక మంచి ధరను ఎంఎస్పీగా ప్రకటించేసి, ఆ రేటు కన్నా తక్కువకు ఎవరూ కొనడానికి వీలు లేకుండా చట్టపరమైన భద్రత కల్పించాలి. దీని అమలును ప్రభుత్వాలు ఒక ఛాలెంజ్‌‌గా తీసుకుని పని చేస్తే రైతుల జీవితాలు మారిపోతాయి. రైతుల ఆదాయానికి మూలమైన ఎంఎస్పీ చట్టబద్ధమైన హక్కుగా మారేలా స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేస్తే ప్రధాని మోడీ లక్ష్యమైన ‘రైతు ఆదాయం రెట్టింపు’ చేయడం అన్నది సాకారమవుతుంది. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా ఆలోచించాల్సి ఉంది. ‘దేశంలోని రైతులందరి ఆదాయం డబుల్ చేయడమే మా లక్ష్యం. 2022లోపు దీనిని సాధించాలన్నదే టార్గెట్’ ప్రధాని మోడీ అనేక సార్లు చెప్పిన మాటలివి. ఈ లక్ష్యం కోసమే కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులకు మంచి చేయడానికేనని చెబుతున్నా.. వాటి వల్ల తమకు నష్టమేనంటూ రైతులు ఢిల్లీలో నిరసనలకు దిగారు. 40 రోజులకు పైగా పోరాటం సాగిస్తున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపినా.. సమస్య పరిష్కారంపై సీరియస్‌‌నెస్ కనిపించడం లేదు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఆ చట్టాలపై చర్చకు పెడతామన్న హామీ ఇవ్వడం ద్వారా రైతుల నిరసనలను విరమింపచేసే ఆలోచన చేస్తే మేలు. అలాగే వరి, గోధుమలతో పాటు అన్ని పంటలకూ మద్దతు ధర ప్రకటించి, పరిస్థితులకు అనుగుణంగా ఏటా పెంచడం, గ్రామాల వరకూ వ్యవసాయ మార్కెట్లను తీసుకెళ్లడం ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడం వంటి ఆల్టర్నేటివ్స్‌‌పై దృష్టి పెట్టాలి. చిన్న పట్టణాలు, గ్రామాల్లో మార్కెట్స్ పెట్టాలె అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీల (ఏపీఎంసీ) చట్టంలో లోపాలున్న మాట నిజం. వాటిని సవరించాలి. వ్యవసాయ మార్కెట్ల వ్యవస్థలో సమస్యలు ఉంటే చక్కదిద్దడమో లేదా దాని స్థానంలో కొత్త వ్యవస్థను తీసుకురావడమో చేయాలి. అటువంటిదేమీ చేయకుండా ఉన్న వ్యవస్థను రద్దు చేయాలనుకోవడం సరి కాదు. చిన్న పట్టణాలు, పెద్ద గ్రామాల్లో సైతం వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేయడం ద్వారా మార్కెటింగ్​లో ఉన్న లోపాలను సరిదిద్దవచ్చు. దీని ద్వారా రైతులకు మార్కెట్లు అందుబాటులోకి రావడంతో పాటు మద్దతు ధరకు అమ్ముకునే భరోసా కల్పించవచ్చు. ఏపీఎంసీ యాక్ట్‌‌ను సంస్కరించడంతో దళారీల బారిన పడకుండా రైతులను కాపాడొచ్చు. కేంద్రం చెబుతున్నట్లు చిన్న, సన్నకారు రైతులు తమ పంటను ఎక్కడికైనా తీసుకెళ్లి అమ్ముకోవడం సాధ్యమయ్యేది కాదు. పల్లెల్లోకి మార్కెట్లు రావడంతో అక్కడ తమ పంటలను మద్దతు ధరకు అమ్ముకునే వీలుకల్పించడంతో వారికి భరోసా వస్తుంది.-పర్సా వెంకట్, పొలిటికల్ ఎనలిస్ట్.