న్యూఢిల్లీ: ఇండియా స్టాక్ మార్కెట్ ఈ వారం తీవ్ర ఒడిదుడుకుల్లో కదలొచ్చని ఎనలిస్టులు అంచనావేస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) నిర్ణయం ఈ నెల 8న వెలువడనుంది. ఇరాన్-–అమెరికా యుద్ధం నేపథ్యంలో ఏప్రిల్ ఎంపీసీ సమావేశంపై ఫోకస్ పెరిగింది. దీనికితోడు గ్లోబల్ ఆర్థిక డేటా, పశ్చిమాసియా యుద్ధ ప్రభావం, క్రూడ్ ఆయిల్ ధరల మార్పులు, విదేశీ పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం కూడా మార్కెట్ను ప్రభావితం చేయనున్నాయి.
ఆర్బీఐ వడ్డీ రేట్లను యధాతథంగా కొనసాగించడం దాదాపు ఖాయమని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. కానీ గవర్నర్ సంజయ్ మల్హోత్ర వ్యాఖ్యలు, 2026–27 అంచనాలను పెట్టుబడిదారులు జాగ్రత్తగా గమనిస్తారని తెలిపారు. ఈ నెల 9న అమెరికా ద్రవ్యోల్బణం వెలువడనుంది. ఈ డేటా ఆధారంగా రేట్ల తగ్గింపుపై ఫెడ్ వైఖరీ ఉంటుంది. ఈ ఏడాది మార్చిలో ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) నికరంగా రూ.1.2 లక్షల కోట్లను మార్కెట్ నుంచి విత్డ్రా చేసుకున్నారు. ఏప్రిల్లో ఇప్పటివరకు రూ.19,837 కోట్ల షేర్లను అమ్మారు.
