న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ రాజస్థాన్ థార్ ఎడారిలో క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ను భారీగా పెంచింది. జైసల్మేర్లోని బఘేవాలా ఆయిల్ ఫీల్డ్లో ఉత్పత్తి రికార్డ్ లెవెల్లో రోజుకు 1,202 బ్యారెల్స్కి చేరింది. గత సంవత్సరం రోజుకు 705 బ్యారెల్స్ మాత్రమే ఉత్పత్తి కాగా, ఈసారి దాదాపు 70శాతం వృద్ధి నమోదైంది. ఉత్పత్తి చేసిన ఆయిల్ను ట్యాంకర్ల ద్వారా గుజరాత్లోని మెహసానా ఓఎన్జీసీ ప్లాంట్కు తరలిస్తోంది.
అక్కడి నుంచి పైప్లైన్ ద్వారా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) నిర్వహించే కొయాలి రిఫైనరీ (గుజరాత్, వడోదర)కి క్రూడ్ చేరుతుంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాజస్థాన్ ఆయిల్ఫీల్డ్ నుంచి 43,773 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఉత్పత్తి జరిగింది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నమోదైన 32,787 మెట్రిక్ టన్నులతో పోలిస్తే గణనీయమైన పెరుగుదల. బఘేవాలా ఆయిల్ ఫీల్డ్లో క్రూడాయిల్ మందంగా ఉంటుంది. దీనిని వెలికితీయడానికి సైక్లిక్ స్టీమ్ స్టిమ్యులేషన్ (సీఎస్ఎస్), డైల్యుంట్ ఇంజెక్షన్, ఆర్టిఫీషియల్ లిఫ్ట్ సిస్టమ్స్ వంటి మోడర్న్ రికవరీ టెక్నాలజీ పద్ధతులను కంపెనీ వాడుతోంది. కాగా, బఘేవాలా ఫీల్డ్ను 1991లో కనుగొన్నారు. 200.26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. ప్రస్తుతం 52 బావులు ఉండగా, 33 బావులు కార్యకలాపాల్లో ఉన్నాయి. సీఎస్ఎస్ ఆపరేషన్లు 2018లో పైలట్గా ప్రారంభమై, ఇప్పుడు 19 బావుల్లో విజయవంతంగా అమలయ్యాయి.
