- కొద్దిగా పెరిగిన ఇండ్ల ధరలు
- జనవరి–మార్చిలో టాప్ 7 సీటీల్లో సగటున 2 శాతం పెరుగుదల
- యుద్ధ ప్రభావంతో కొనుగోళ్లు 7 శాతం డౌన్
- హైదరాబాద్లో చదరపు అడుగు సగటు ధర రూ.7,990
- అనరాక్ రిపోర్ట్ వెల్లడి
న్యూఢిల్లీ: ఇరాన్–అమెరికా యుద్ధ ప్రభావం రియల్ ఎస్టేట్ మార్కెట్పై కూడా పడింది. ఇండియాలోని టాప్ ఏడు సిటీలలో ఇండ్ల ధరలు ఈ ఏడాది జనవరి–మార్చి క్వార్టర్లో సగటున 2 శాతం మాత్రమే పెరిగాయి. కరోనా సంక్షోభం తర్వాత క్వార్టర్ ప్రాతిపదికన సగటున 5–7 శాతం పెరుగుదల కనిపించింది. ఈసారి యుద్ధం వలన కొనుగోలుదారులు ఇండ్లు కొనడానికి ఒకటికిరెండు సార్లు ఆలోచిస్తున్నారని రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ కంపెనీ అనరాక్ పేర్కొంది. ఫలితంగా అమ్మకాలు తగ్గాయని, ధరల పెరుగుదల పరిమితంగా ఉందని వివరించింది. ఈ సంస్థ రిపోర్ట్ ప్రకారం, మార్చి క్వార్టర్లో దేశంలోని టాప్ సీటీలలో ఇండ్ల సగటు ధర చదరపు అడుగుకి రూ.9,456 కి చేరింది. ఇది కిందటేడాది డిసెంబర్ క్వార్టర్లో నమోదైన రూ.9,260 నుంచి కొద్దిగా ఎక్కువ. మార్చి క్వార్టర్లో నమోదైన రూ.8,868 కంటే 7 శాతం పెరుగుదల
హైదరాబాద్లో 6 శాతం అప్
- నగరాల వారీగా చూస్తే, హైదరాబాద్లో ధరలు క్వార్టర్ ప్రాతిపదికన 2 శాతం పెరిగి చదరపు అడుగుకి రూ.7,990కి చేరాయి. డిసెంబర్ క్వార్టర్లో సగటు ధర రూ.7,830గా ఉంది. అదే ఏడాది లెక్కన చూస్తే రూ.7,550 నుంచి 6 శాతం పెరుగుదల కనిపించింది.
- ఢిల్లీ ఎన్సీఆర్లో ధరలు డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే 3 శాతం పెరిగి రూ.9,300 నుంచి రూ.9,620కి చేరాయి. వార్షికంగా అయితే రూ.8,330 నుంచి 15 శాతం పెరిగాయి.
- ముంబై మెట్రోపాలిటన్ రీజియన్లో ధరలు ఒక శాతం పెరిగి రూ.17,600కి చేరగా, వార్షికంగా రూ.17,350 నుంచి 4 శాతం పెరిగాయి.
- బెంగళూరులో చదరపు అడుగు సగటు ధర రూ.9,100 నుంచి 2 శాతం పెరిగి రూ.9,310కి చేరింది. కిందటేడాది మార్చి క్వార్టర్లోని రూ.8,650 నుంచి 8 శాతం పెరిగింది.
- పుణెలో ధరలు 2 శాతం పెరిగి రూ.8,220కి చేరాయి. వార్షికంగా 5 శాతం వృద్ధి నమోదైంది.
- చెన్నైలో ధరలు ఒక శాతం పెరిగి రూ.7,165కి చేరాయి, వార్షికంగా 4 శాతం పెరిగాయి.
- కోల్కతాలో ధరలు 3 శాతం పెరిగి రూ.6,290కి చేరాయి, వార్షికంగా 6 శాతం వృద్ధి నమోదైంది.
అమ్మకాలు డల్
అమ్మకాల పరంగా పరిస్థితి బలహీనంగా ఉంది. ఈ ఏడాది మార్చి క్వార్టర్లో మొత్తం 1,01,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. గతేడాది మార్చి క్వార్టర్లో నమోదైన 93,280 యూనిట్ల నుంచి 9 శాతం పెరిగినప్పటికీ, డిసెంబర్ క్వార్టర్లోని 1,08,970 యూనిట్ల నుంచి 7 శాతం తగ్గాయి. అనరాక్ చైర్మన్ అనుజ్ పూరి మాట్లాడుతూ, ఇరాన్ యుద్ధం ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మిడిల్ఈస్ట్ పెట్టుబడిదారులు భారత రియల్ ఎస్టేట్లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టే వారని, యుద్ధం కారణంగా కొనుగోళ్లు వాయిదా వేశారని తెలిపారు.
