
- ఖమ్మం జిల్లా కామంచికల్లులో ప్రమాదం
ఖమ్మం రూరల్, వెలుగు: తాటి చెట్టు నుంచిపై నుంచి పడిన గీత కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. బాధిత కుటుంబం తెలిపిన ప్రకారం.. ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు గ్రామానికి చెందిన బాల నాగన్న(41) కల్లుగీత కార్మికుడు. సోమవారం ఉదయం గ్రామంలోని ఓ రైతు పొలంలోని తాటి చెట్టుని ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డాడు. భర్త ఎంతకూ ఇంటికి రాకపోవడంతో భార్య వెళ్లి చూసింది. నాగన్న చెట్టు కింద పడి ఉండి చెవి, ముక్కులోంచి రక్తం కారుతూ కనిపించాడు.
భార్య వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి ఖమ్మంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు చికిత్స ప్రారంభించిన కొద్దిసేపటికే అతడు మృతి చెందాడు. నాగన్న దంపతులకు ముగ్గురు కొడుకులు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఖమ్మం రూరల్ ఎస్ఐ రాజు తెలిపారు.