- గంటసేపట్లోనే ఇద్దరూ మృతి
- సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూర్ తండాలో ఘటన
పుల్కల్, వెలుగు : రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి చెందాడని తెలిసి తట్టుకోలేని తండ్రి గంటసేపటిలోనే గుండె పోటుతో చనిపోయాడు. ఈఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గోంగ్లూర్ తండాలో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తండాకు చెందిన బానోత్ భీమ్లా(48) తన బైక్ పై వ్యవసాయ బోరు మోటార్ రిపేర్ కోసం జోగిపేటకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో నేషనల్ హైవే 161పై అందోల్ మండలం అల్మాయిపేట్ వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో భీమ్లా అక్కడికక్కడే మృతిచెందాడు.
ఈ విషయం తెలిసిన తండ్రి ధర్మనాయక్(70)కు గుండె పోటు వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు దవాఖానకు తీసుకెళ్తుండగా చనిపోయాడు. తండ్రీకొడుకులు ఇద్దరూ గంటలోనే చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ధర్మనాయక్ భార్య చనిపోగా, నలుగురు కొడుకులు ఉన్నారు. అందులో భీమ్లా పెద్ద కొడుకు. భీమ్లాకు భార్య, ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.