
వాషింగ్టన్: టారిఫ్లపై విమర్శలు గుప్పిస్తున్న ట్రంప్ మాజీ సెక్యూరిటీ అడ్వైజర్ జాన్ బొల్టన్ ఇంటిపై ఎఫ్బీఐ దాడులు చేసింది. శుక్రవారం ఉదయం 7 గంటలకే మేరీల్యాండ్లోని బెథెస్డాలో ఉన్న ఆయన ఇంటికి చేరుకున్న ఎఫ్బీఐ అధికారులు.. సోదాలు ప్రారంభించారు. ‘జాతీయ భద్రతా దర్యాప్తు’లో భాగంగానే సోదాలు చేశామని అధికారులు మీడియాకు వెల్లడించారు.
‘‘చట్టం ముందు అందరూ సమానులే’’ అంటూ ఎఫ్బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్ ఎక్స్లో పోస్టు పెట్టారు. కాగా, రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవంటూ బొల్టన్ తరుచూ విమర్శిస్తున్నారు. నోబెల్ శాంతి బహుమతి కోసమే ట్రంప్ ఇదంతా చేస్తున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. ట్రంప్ విధించిన టారిఫ్లు, ఫారిన్ పాలసీలపై బొల్టన్ బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఎఫ్బీఐ సోదాలు.. రాజకీయ కక్షపూరితమైనవని పలువురు విమర్శిస్తున్నారు.
ట్రంప్ మొదటి పాలనలో జాన్ బొల్టన్ 17 నెలల పాటు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేశారు. కాగా, క్లాసిఫైడ్ డాక్యుమెంట్లు కలిగి ఉన్నారన్న అనుమానంతోనే బొల్టన్ ఇంట్లో సోదాలు జరిగినట్లు తెలుస్తున్నది. ఎఫ్బీఐ సోదాలు చేస్తున్న టైమ్లో బొల్టన్ ఇంట్లోనే ఉన్నారు. గతంలో బైడెన్ పాలనలో రాజకీయ కారణాలతో ఆగిపోయిన దర్యాప్తును ట్రంప్ పునరుద్ధరించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. 2020లో బొల్టన్ రిలీజ్ చేసిన ‘ది రూమ్ వేర్ ఇట్ హ్యాపెన్డ్’ బుక్లో కీలక సమాచారం వెల్లడించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.