- స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు పేరెంట్స్ ధర్నా
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల దోపిడీని అడ్డుకోవాలని డిమాండ్ చేస్తూ స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముందు సోమవారం పేరెంట్స్ ధర్నా చేశారు. అన్ని రాష్ట్రాలకంటే తెలంగాణలోనే ఫీజుల దోపిడీ ఎక్కువగా ఉందని, వెంటనే ఫీజుల కట్టడి చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాగటి నారాయణ, టీఎస్టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ రాకముందు కార్పొరేట్ విద్యా సంస్థలను కంట్రోల్ చేస్తామని చెప్పిన నాయకులు, ఎనిమిదేండ్లుగా ఆ మాటే మరిచిపోయారని ఆరోపించారు.
కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థలు ఏటా 20–30% ఫీజులు పెంచుతూ పోతున్నాయని, వాటిని కంట్రోల్ చేయడం లేదని మండిపడ్డారు. విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్, ప్రైవేటు విద్యాసంస్థల్లో 25% సీట్లు పేదలకు కేటాయించాలన్నారు. ఫీజుల భారం భరించలేక పేరెంట్స్ నగలను తాకట్టు పెడుతున్నారని, ఆస్తులను అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో ఫీజుల నియంత్రణ చట్టాలున్నాయని, తెలంగాణలో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. హయ్యర్ ఎడ్యుకేషన్లో మాదిరిగానే మూడేండ్లకోసారి ఫీజులను నిర్ణయించాలని, ఏటా 10% ఫీజులు పెంచుకోవాలన్న తిరుపతిరావు కమిటీ సిఫార్సులను తిరస్కరించాలని సూచించారు.
ఇవి కూడా చదవండి
జీతాలు రాక ప్రభుత్వ టీచర్ల అవస్థలు
పర్సనాలిటీ డిజార్డర్తో పరేషాన్