ఆర్టీసీ సిబ్బందిపై దాడి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎండీ సజ్జనార్ హెచ్చరించినా దాడులు ఆగడం లేదు. ఇటీవలే చిల్లర ఇవ్వలేదని ఓ మహిళ ఆర్టీసీ కండక్టర్ పై దాడి చేసిన సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా రాజేంద్ర నగర్ లో మరో మహిళ ఆర్టీసీ కండక్టర్ పై దాడి చేసింది.
హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో ఓ మహిళా ప్రయాణికురాలు ఆర్టీసీ బస్సు కండక్టర్ పై దాడి చేసింది. బస్సు కండక్టర్ ను చెప్పుతో కొట్టింది. అడిగిన చోట బస్సు ఆపలేదని ఆరోపిస్తూ కండక్టర్ ను విచక్షణారహితంగా బూతులు తిడుతూ.. చెప్పుతో కొట్టింది. . మెహదీపట్నం నుండి ఉప్పల్ వెళ్లే ఆర్టీసీ బస్సు లో ఈ ఘటన జరిగింది. కండక్టర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన మహిళ శివరాంపల్లి కి చెందిన ప్రసన్నగా గుర్తించారు.
తాగొచ్చి..కండక్టర్ ను తన్నిన మహిళ
జనవరి25 న హయత్ నగర్ బస్ డిపో 1కు చెందిన కండక్టర్ మీద ఓ మహిళ మద్యం మత్తులో నానా బూతులు తిడుతూ, దుర్భాష లాడుతూ, కొడుతూ, కాలుతో తన్ని దాడికి పాల్పడింది. బస్సులో ఉన్న తోటి మహిళా ప్రయాణికులు ఎంత వారించినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్ పై దాడి చేసింది. బాధితుడి కంప్లైంట్ తో పోలీసులు ఆ మహిళను అరెస్ట్ చేశారు.