
బటుమి (జార్జియా): ఫిడే విమెన్స్ చెస్ వరల్డ్ కప్లో ఇండియా యంగ్ సెన్సేషన్ దివ్య దేశ్ముఖ్ సెమీ ఫైనల్ చేరుకుంది. క్వార్టర్ ఫైనల్లో 3–1 తేడాతో సీనియర్ ప్లేయర్, తెలుగమ్మాయి ద్రోణవల్లి హారికకు చెక్ పెట్టి ముందంజ వేసింది. క్వార్టర్స్ తొలి రెండు క్లాసికల్ గేమ్స్ను డ్రా చేసుకున్న దివ్య, హారిక చెరో పాయింట్తో సమంగా నిలిచారు. విన్నర్ను తేల్చేందుకు సోమవారం జరిగిన టై బ్రేక్స్లో దివ్య సూపర్ పెర్ఫామెన్స్ చేసింది.
వరసగా రెండు గేమ్స్లో తెలివైన ఎత్తులు వేస్తూ, దూకుడుగా ఆడి హారికను ఓడించింది. ఫలితంగా హారిక మరోసారి క్వార్టర్స్లోనే వెనుదిరిగింది. మంగళవారం మొదలయ్యే సెమీస్లో దివ్య.. మాజీ వరల్డ్ చాంప్ టాజ్ జోంగ్జితో తలపడనుంది. ఇప్పటికే సెమీస్ చేరిన కోనేరు హంపి మరో చైనా ప్లేయర్ లి తింగ్జీతో పోటీపడనుంది.