ఫైనల్ ఫీవర్.. కామెంటేటర్గా షారుఖ్ 

ఫైనల్ ఫీవర్.. కామెంటేటర్గా షారుఖ్ 

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కామెంటేటర్ గా మారాడు. అర్జెంటీనా, ఫ్రాన్స్ మధ్య ఫిఫా ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు ‘జియో సినిమా’ చానల్ లో ఏర్పాటుచేసిన చర్చా కార్యక్రమంలో వ్యాఖ్యాతగా సందడి చేశాడు. ఫుట్ బాల్ ఫైనల్ మ్యాచ్ వేళ నెలకొన్న ఉత్కంఠ భరిత వాతావరణం గురించి తనదైన శైలిలో వివరించాడు. ఇంగ్లండ్ ఫుట్ బాల్ లెజెండ్ వాయెన్ రూనీతో సంభాషిస్తూ ఎంతో సరదాగా ఈ కామెంట్రీ సాగింది. ‘యువర్ ఏ టఫ్ బాయ్’ అని ఈసందర్భంగా రూనీని ఉద్దేశించి షారుఖ్ కామెంట్ చేశాడు. ‘రూనీ, మాంచెస్టర్ యునైటెడ్ ఫుట్ బాల్ టీమ్ మ్యాచ్ లను టీవీలో చూస్తూ నా బాల్యం గడిచింది’ అని ఈసందర్భంగా షారుఖ్ గుర్తు చేసుకున్నారు. రూనీ ఆటతీరు, పట్టుదల, క్రీడా స్ఫూర్తి ఈతరం క్రీడాకారులకు ఆదర్శప్రాయమని కొనియాడారు. 

ఇక సాకర్ సమరంలో విశ్వవిజేత ఎవరో కాసేపట్లో  తేలిపోనుంది. రాత్రి జరిగే ఫైనల్ పోరులో.. అర్జెంటీనాతో ఫ్రాన్స్ తలపడుతోంది. ఈ మ్యాచ్ చూడటానికి లక్షలాది మంది టీవీల ముందు అతుక్కుపోయారు. ఫిఫా ఫైనల్ విషయానికి వస్తే...బలాబలాల్లో అర్జెంటీనా, ఫ్రాన్స్ రెండు జట్లు సమంగా కనిపిస్తున్నాయి. అర్జెంటీనాకు కెప్టెన్ మెస్సీ బలం. అయితే ఫ్రాన్స్ మాత్రం సమిష్టిగా రాణిస్తోంది. అర్జెంటీనాతో పోలిస్తే ఫ్రాన్స్ లో మ్యాచ్ విన్నర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో ఆదివారం జరిగే ఫైనల్ సాకర్ అభిమానులను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది.