బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ దిగ్గజం దిలీప్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ లెజెండ్ దిలీప్ కుమార్ (98) ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో మరణించారు. శ్వాస తీసుకోవడంలో ఆయనకు ఇబ్బందులు తలెత్తడంతో గత బుధవారం జూన్ 30న ఆయనను ఆసుపత్రికి తరలించారు.  జూన్ నెలలో దిలీప్ కుమార్ ఆసుపత్రిలో చేరడం రెండవసారి. దిలీప్ కుమార్‌ను జూన్ 6న తొలిసారిగా ఆసుపత్రికి తరలించారు. అప్పుడు ఆయనను ఆక్సిజన్ సపోర్ట్ మీద ఉంచారు. అక్కడ నాలుగు రోజులు చికిత్స తీసుకున్న తర్వాత జూన్ 11న డిశ్చార్జ్ అయ్యారు. గతేడాది మార్చిలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించే ముందు దిలీప్ కుమార్ మరియు ఆయన భార్య, నటి సైరా బాను ముందు జాగ్రత్త చర్యగా సెల్ప్ ఐసోలేషన్ విధించుకున్నారు. 

దిలీప్ కుమార్ గత కొన్నేళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. అంతేకాకుండా ఆయనకు శ్వాస సంబంధ సమస్యలు కూడా ఉన్నాయి. ఆయన ఆరోగ్యం విషమించడంతో బుధవారం ఉదయం 7.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. దిలీప్ కుమార్ పాకిస్తాన్‌లోని పేషావర్‌లో 1922 డిసెంబర్ 11న జన్మించారు. దిలీప్ కుమార్ అసలు పేరు మహ్మద్ యూసుఫ్ ఖాన్. దిలీప్ కుమార్ నటి సైరా బానును 1966లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో గోపి, సాగినా మరియు బైరాగ్ వంటి చిత్రాలు వచ్చాయి.

దిలీప్ కుమార్ మొదటిసారి  1944లో జ్వార్ భాటా సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. 1947లో విడుదలైన జుగ్ను దిలీప్ కుమార్ మొదటి హిట్ సినిమా. ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డు పొందిన మొదటి వ్యక్తిగా దిలీప్ కుమార్ నిలిచారు. ఆయనకు ఉత్తమ నటుడిగా ఎనిమిదిసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు వచ్చింది. దిలీప్ కుమార్ పద్మ విభూషణ్, పద్మ భూషణ్ మరియు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులను కూడా అందుకున్నారు. ఆయన పాకిస్తాన్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారం.. నిషన్-ఎ-ఇంతియాజ్‌ను  కూడా 1998లో తీసుకున్నారు. దిలీప్ కుమార్ అనేక సినిమాటిక్ అవార్డులను గెలుచుకున్నారు.

దిలీప్ కుమార్ నయా దౌర్, మొఘల్-ఎ-అజామ్, దేవదాస్, రామ్ ఔర్ శ్యామ్, అందాజ్, మధుమతి మరియు గంగా జమునా చిత్రాలలో నటించారు. మొఘల్-ఎ-అజామ్ సినిమా దిలీప్ కుమార్ సినిమాలలో ఒక కీర్తి పతాకంగా నిలిచింది. దిలీప్ కుమార్ చివరి చిత్రంగా 1998లో వచ్చిన ఖిలా నిలిచింది.

దిలీప్ కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ సంతాపం తెలిపారు. సినిమాటిక్ లెజెండ్‌గా ఆయన ప్రతి ఒక్కరికీ గుర్తుండిపోతారని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. దిలీప్ కుమార్ మృతి సాంస్కృతిక ప్రపంచానికి తీరని లోటని ఆయన అన్నారు. ఇండియన్ సినిమాకు దిలీప్ చేసిన సేవలు మరువలేనివని రాహుల్ గాంధీ అన్నారు. భవిష్యత్ తరాలు దిలీప్ కుమార్‌ను గుర్తుంచుకుంటాయని ఆయన అన్నారు.

దిలీప్ కుమార్ మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్ తన సంతాపం ప్రకటించారు. దిలీప్ కుమార్ దేశంలోని ప్రతి ఒక్కరిలో జీవిస్తారని రాష్ట్రపతి అన్నారు.  ‘దిలీప్ కుమార్ భారతదేశ చరిత్రలో మిగిలిపోతారు. ఆయన కీర్తి సరిహద్దులను దాటింది. ఆయన మరణంతో ఒక శకం ముగుస్తుంది. దిలీప్ సాబ్ దేశంలోని ప్రతి ఒక్కరిలో శాశ్వతంగా జీవిస్తారు. ఆయన కుటుంబానికి మరియు అభిమానులకు నా సంతాపం’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.