భయపడితే రాజకీయం చేయలేం: మంత్రి కొండా సురేఖ

భయపడితే రాజకీయం చేయలేం: మంత్రి కొండా సురేఖ

మెదక్: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గ కార్యకర్తల సమావేశం సంగారెడ్డి పట్టణ కేంద్రంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానంలో ఎంపీపీ నుంచి మినిస్టర్ వరకు ఎదిగానని ఆమె అన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ల పాలనలో అనేక నిర్భంధాలకు గురైయ్యామని, ఎన్నో అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కూడా ఎవరికీ భయపడలే... భయపడితే రాజకీయం చేయలేమని ఆమె చెప్పారు.

జనాల్లో ఉన్నాం కాబట్టే ప్రజలు ఆదరించారి గెలిపించారని మంత్రి సురేఖ అన్నారు. రైతు బంధుపై బీఆర్ఎస్ నేతలు దుష్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. అధికారాన్ని అనుభవించి.. హామీలు నెరవేర్చలేదని విమర్శించారు. కేటీఆర్ ఇప్పుడు హామీల గురించి మాట్లాడుతున్నాడు.. హామీలు నెరవేర్చని బీఆర్ఎస్ కు కాంగ్రెస్ ను విమర్శించే హక్కు లేదన్నారు.  గజ్వేల్, సిద్దిపేటలో మెజారిటీ ఓట్లు సాధిస్తామని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. 
పేదల సంక్షేమం, అభివృద్ధికి పాటు పడే పార్టీ ఒకటి ఉందంటే అది కాంగ్రెస్ అని, మెదక్  నుంచి పోటీ చేసిన ఇందిరమ్మ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు దోహద పడిందని ఆమె గుర్తు చేశారు. ఈ ఎన్నికలలో ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంటే రాహుల్ గాంధీ నానమ్మ సీటు గెలిచిందని, సోనియా గాంధీ అత్తమ్మ సీటు గెలిచిందని సంతోషపడతారని ఆమె అన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి నీలం మధు ముదిరాజును గెలిపించాలని మంత్రి కోరారు. మరో 30 రోజులు ఎంపీ అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు  కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ సూచించారు.

 
మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు మాట్లాడుతూ.. తెలంగాణ ఇచ్చినది కాంగ్రెస్ పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రాహుల్ గాంధీకి దేశ ప్రధానిగా అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ప్రాంతానికి  ఫ్యాక్టరీలు, కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధిని కల్పించిందని అన్నారు. మెదక్ పార్లమెంటు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, సంగారెడ్డి ఇంచార్జ్ జగ్గారెడ్డిలకు నీలం మధు కృతజ్ఞతలు తెలిపారు.