కాంగ్రెస్ నేత, పంజాబ్ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూపై పోలీసులు FIR నమోదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్లోని కతియార్ జిల్లాలో చేసిన వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించాయని భావించిన ఎలక్షన్ కమీషన్(EC) చర్యలకు ఉపక్రమించింది. ముస్లిం సోదరులను ఓట్లు అభ్యర్ధిస్తూ చేసిన వ్యాఖ్యలు ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పలువురు EC కి ఫిర్యాదు చేశారు.
ముస్లింలు 64 శాతం మంది ఉన్నారన్న సిద్ధూ… ఓవైసి లాంటి వారి వలలో పడకుండా మీ బలాన్ని తెలుసుకుని ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మాజీ కేంద్ర మంత్రి తారిక్ అన్వర్కు ఓటు వేసి… మోడీని ఓడించాలని ప్రజలను కోరారు. దీనిపై స్పందించిన బీజేపీ నాయకులు ఆయన వ్యాఖ్యలు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని EC కి ఫిర్యాదు చేశారు. దీంతో బరసోయి పోలీసు స్టేషన్లో ఎన్నికల తనిఖీ విభాగం ఫిర్యాదుతో సిద్ధూపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.