న‌డిరోడ్డుపై కారు ద‌గ్ధం.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

న‌డిరోడ్డుపై కారు ద‌గ్ధం.. తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

చిత్తూరులో జిల్లాలో నడిరోడ్డుపైనే ఓ కారు మంటల్లో కాలి బూడిదైంది. కొన్ని గంట‌ల క్రిత‌మే కొనుగోలు చేసిన కారులో మంట‌లు చెల‌రేగ‌డం, అలా నిమిషాల వ్య‌వ‌ధిలోనే కారు దగ్ధమవడంతో కారు య‌జ‌మాని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. వివరాల్లోకి వెళ్తే… చిత్తూరులోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో వంట మాస్టర్‌గా పనిచేస్తున్న రాజేష్ అనే వ్య‌క్తి బుధవారం ఓ సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేశాడు. అనంతరం కాణిపాకంలో పూజ చేయించేందుకు వెళ్తుండగా… ఆరో నంబర్ జాతీయ రహదారిపై రెడ్డిపల్లి సమీపంలో గల రామాపురం క్రాస్ దగ్గర అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. అయితే అప్రమత్తంగా వ్యవహరించిన రాజేష్… మంటలు అంటుకున్న క్షణాల వ్యవధిలోనే కారు నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. ప్రాణాపాయం నుంచి తృటిలో త‌ప్పించుకున్నాడు. అయితే కష్టపడి సంపాద‌న‌తో కొనుక్కున్న కారు… కొన్ని గంటలు కూడా గడవకముందే మంటలకు ఆహుతవడంపై అత‌ను ఆవేదన వ్యక్తం చేశాడు.