హైదరాబాద్ లోని మాదాపూర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఇవాళ ఉదయం నీరుస్ సర్కిల్ లో ఇస్మాయిల్ అనే రౌడీ షీటర్ పై మరో రౌడీ షీటర్ ముజ్జు కాల్పులు జరిపి పరారయ్యాడు. ఇస్మాయిల్ మృతి చెందగా.. జాంగీర్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన అతడిని తోటి స్నేహితులు ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన స్థలంలో రక్తపు మరకలు ఉన్నాయి. కాల్పులు జరిపింది ఒక్కరేనా ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు పోలీసులు.
ల్యాండ్ వివాదం సెటిల్మెంట్ కోసం తెల్లవారుజామున నీరుస్ సిగ్నల్ అయ్యప్ప సొసైటీ వద్దకు రెండు గ్రూప్ లు చేరుకున్నాయి. అయితే చర్చలు జరుగుతున్న సమయంలోనే రౌడీషీటర్ మహమ్మద్ అలియాస్ ముజ్జు కాల్పులు జరిపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇస్మాయిల్ ,ముజ్జు వీళ్లిద్దరు గతంలో జైల్ ఫ్రెండ్స్. జైల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. అయితే వ్యాపారంలో గొడవలతో ఇస్మాయిల్ పై ముజ్జు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది.