- జీహెచ్ఎంసీపై కన్నేసిన కొందరు ఆఫీసర్లు
- బల్దియా విస్తరణతో హెచ్ఎండీఏను వీడేందుకు ప్లాన్
హైదరాబాద్సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ పరిధిని విస్తరించడంతో తాజాగా హెచ్ఎండీఏలో డిప్యూటేషన్పై కొనసాగుతున్న అధికారుల్లో చాలా మంది.. తిరిగి తమ మాతృసంస్థకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. హెచ్ఎండీఏలోని ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాల్లో కొందరు అధికారులు జీహెచ్ఎంసీపై కన్నేశారు. జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకూ విస్తరించిన విషయం తెలిసిందే. ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేయడంతో ఇప్పుడు చాలా మంది హెచ్ఎండీఏలోని అధికారులు ఆయా ప్రాంతాల్లో కీలక బాధ్యతల కోసం ఉన్నతస్థాయిలో కొందరు ప్రయత్నిస్తుండగా, మరి కొందరు శాఖాపరంగా ప్రయత్నాలు మొదలు పెట్టారు.
2006లో హెచ్ఎండీఏ ఏర్పడిన తర్వాత జీహెచ్ఎంసీ, డీటీసీపీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ల నుంచి పెద్ద సంఖ్యలో ఇంజినీరింగ్, ఇతర ముఖ్యమైన అధికారులు చాలా మంది డిప్యుటేషన్పై హెచ్ఎండీఏలోకి వచ్చారు. ఇప్పటికీ హెచ్ఎండీఏలో దాదాపు 28 మంది అధికారులు ఇతర శాఖల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఇందులో ప్లానింగ్ డైరెక్టర్ల నుంచి అసిస్టెంట్ప్లానింగ్ ఆఫీసర్ల వరకూ వివిధ కేటగిరీలకు చెందిన వారున్నారు. తాజాగా హెచ్ఎండీఏ పరిధి ఔటర్ రింగ్రోడ్ నుంచి త్రిపుల్ ఆర్ వరకూ ఏర్పాటు చేశారు. అంటే అంతకు ముందు 7,252 చ.కి.మీ. పరిధిలో ఉన్న హెచ్ఎండీఏను తాజాగా 10,050 చ.కి.మీ.లకు పెంచారు. అయితే అతి ముఖ్యమైన ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలే ఇప్పుడు కొందరు అధికారులకు కాసులు కురిపించే కేంద్రాలుగా ఉన్నాయి.
ఈ ప్రాంతాలన్నీ ఇప్పుడు జీహెచ్ఎంసీలో విలీనం కావడంతో చాలా మంది హెచ్ఎండీఏలోని అధికారులు తిరిగి జీహెచ్ఎంసీకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం. జీహెచ్ఎంసీని విస్తరించడంతో ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్కు పెద్ద సంఖ్యలో అధికారుల అవసరం ఏర్పడనుంది. కొందరు అధికారులు ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేసుకుంటున్నట్టు సమాచారం.
ప్రయత్నాలు ఎందుకంటే...
తాజాగా హెచ్ఎండీఏలోకి జీహెచ్ఎంసీ, రెవెన్యూ, డీటీసీపీ నుంచి డిప్యుటేషన్పై వచ్చిన వారు ఉన్నారు. వీరిలో అధికశాతం ప్లానింగ్, ఇంజినీరింగ్, ఎస్టేట్ విభాగాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఓఆర్ఆర్ వరకూ బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు, టౌన్షిప్లు, లే ఔట్లకు అనుమతులు, లేఔట్ల రెగ్యులరైజేషన్ వంటి అనుమతులన్నీ హెచ్ఎండీఏ మంజూరు చేస్తోంది. ఈ విభాగాలన్నీ లాభదాయకమైనవే కావడంతో కొన్ని విభాగాల్లో, ముఖ్యంగా ప్లానింగ్లో కొందరు అధికారులు భారీగా ఆదాయాన్ని పోగేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జీహెచ్ఎంసీ పరిధి ఓఆర్ఆర్ వరకూ విస్తరించడంతో అనుమతులు ఇచ్చే అధికారం జీహెచ్ఎంసీకి బదిలీ కానుంది.
దీంతో హెచ్ఎండీఏలో తమకు పనిలేకుండా పోతుందని భావిస్తున్న కొందరు అధికారులు ఇప్పటి నుంచే జీహెచ్ఎంసీలోకి వెళ్లేందుకు ప్లాన్చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం రాజకీయంగా పైరవీలకు తెరలేపినట్లు సమాచారం. జీహెచ్ఎంసీ పరిధి విస్తరించినప్పటికీ నిర్మాణాల అనుమతులిచ్చే అధికారం మాత్రం బదిలీ కాలేదు. ప్రస్తుతం హెచ్ఎండీఏ వద్దనే అధికారాలు ఉన్నాయి. త్వరలోనే సీఎం సమక్షంలో జరుగనున్న హెచ్ఎండీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో హెచ్ఎండీఏ అధికారాలను బదిలీ చేసే విషయం తేలిపోనుంది.
