- భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కు సంబంధించి 15 రోజుల్లోగా భూ సేకరణ పూర్తి చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి పలు శాఖల జిల్లా ఆపీసర్లు, తహసీల్దార్లతో మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. అన్నపురెడ్డిపల్లి, అశ్వాపురం, బూర్గంపహాడ్, చుంచుపల్లి, చంద్రుగొండ, దమ్మపేట, జూలూరుపాడు, కొత్తూగూడెం, ములకలపల్లి, పాల్వంచ, సుజాతనగర్ మండలాల్లో డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్కు సంబంధించి భూ సేకరణను వేగవంతం చేయాలన్నారు.
రోజూ ఏ మండలంలో ఎంత వరకు సర్వే పూర్తి అయిందో వివరాలతో నివేదికలను అందజేయాలన్నారు. సీతమ్మ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి చర్ల, దుమ్ముగూడెం, మణుగూరు మండలాల్లోనని 30 గ్రామాల్లో భూ సేకరణ పనులను భద్రాచలం సబ్ కలెక్టర్ పర్యవేక్షించాలని చెప్పారు. ఓటరు జాబితాలో ఉన్న డూప్లికేట్ఎంట్రీలు, బ్లర్ ఫొటోలు, ఇతర లోపాలను గుర్తించి, నిబంధనల ప్రకారంగా సరిదిద్దాలన్నారు.
ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధిలో సూపర్ వైజర్లు, బూత్ స్థాయి అధికారులు కో ఆర్డినేషన్తో పనిచేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఎక్కువ, తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసుకొని బుధవారం మ్యాపింగ్ చేయాలన్నారు. రైస్ మిల్లులతో పాటు కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్లు నిరంతరం తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై దృష్టి పెట్టాలన్నారు.
