న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ కారు పేలుడు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ కారు పేలుడు ఘటనకు మాస్టర్ మైండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ మహ్మద్ ఉమర్ తొలి చిత్రం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఉమర్ ఫొటోలను మంగళవారం (నవంబర్ 11) దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా అనుమానితుడు ఫొటోలను గుర్తించారు అధికారులు.
ఫరీదాబాద్ టెర్రర్ మాడ్యూల్కు చెందిన అనుమానిత ఉగ్రవాది మహ్మద్ ఉమర్ ఫరీదాబాద్లోని అల్ ఫలాహ్ మెడికల్ కాలేజీలో డాక్టర్గా పనిచేస్తున్నాడని ఇంటలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. గత వారం అనంతనాగ్లో అరెస్టైన ప్రభుత్వ వైద్య కళాశాల మాజీ సీనియర్ రెసిడెంట్ డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్కు ఉమర్ సన్నిహితుడని సమాచారం. ఉమర్ తన సహచరులతో కలిసి కారులో డిటోనేటర్ పెట్టి ఈ ఉగ్రవాద చర్యకు పాల్పడ్డాడని దర్యాప్తు సంస్థలు గుర్తించాయి.
పేలుడులో అమ్మోనియం నైట్రేట్ ఇంధనం ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ ఘటనకు సంబంధించి ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం కనీసం 13 మంది అనుమానితులను విచారిస్తున్నారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉమర్ తల్లి షహీమా బానో, సోదరులు ఆషిక్, జహ్రూర్లను విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం (నవంబర్ 11) భారీ పేలుడుతో దేశరాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడిన విషయం తెలిసిందే. రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ సమీపంలోని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద జరిగిన బ్లాస్ట్లో ఇప్పటి వరకు 11 మంది చనిపోయారు. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
ఘటనా స్థలాన్ని మొత్తం నల్లటి పొగ కమ్మేసింది. అరుపులు.. ఏడుపులతో ఆ ప్రాంతమంతా భయానకంగా మారింది. ఓ వ్యక్తి డెడ్బాడీ కారు సైడ్ మిర్రర్పై వేలాడుతూ కనిపించింది. ఆటో రిక్షాపై ఓ వ్యక్తి చేయి తెగిపడింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోమవారం (నవంబర్ 11) సాయంత్రం 6.52 గంటలకు హ్యుందాయ్ ఐ20 కారులో పేలుడు సంభవించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బ్లాస్ట్ సమయంలో కారులో ప్రయాణికులు ఉన్నారని, వెహికల్ స్లోగా మూవ్ అవుతున్నదని చెప్తున్నారు. పేలుడు ధాటికి 22 కార్లు, 2 ఈ -రిక్షాలు, ఒక ఆటో రిక్షా మంటల్లో కాలి బూడిదయ్యాయి.
కొన్ని మీటర్ల దూరం వరకు పార్క్ చేసిన వాహనాల అద్దాలూ ధ్వంసం అయ్యాయి. ఇండ్లు, దుకాణాల తలుపులు, కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ప్రమాదం అనంతరం 20 ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేశాయి. పేలుడు ఘటనలో 24 మందిగాయపడ్డారు. వీరిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. గాయపడిన వారిని దగ్గర్లోని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తరలించారు.
