ప్రజలందరికీ ఫస్ట్ రెండు టెస్టులు ఉచితమన్న కేంద్రం
ఇటలీ, ఇరాన్లో చిక్కుకున్నోళ్లు ఇండియాకు
దేశంలో 107కు చేరిన కరోనా కేసులు
కరోనా టెస్టులను ఫ్రీగా చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి రెండు కన్ఫర్మేషన్ టెస్టులను పౌరులందరికీ ఉచితంగా చేస్తామని ప్రకటించింది. ఆదివారం కేంద్ర ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ విషయాన్ని ప్రకటించారు. టెస్టులు చేయడానికి దేశంలో పూర్తిస్థాయి మౌలిక వసతులున్నాయని, కానీ, ఇప్పటిదాకా రోజూ 10 శాతానికి మించి అవసరం పడట్లేదని చెప్పారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య 107కి చేరింది. 31 కేసులతో మహారాష్ట్ర టాప్లో ఉంది. తర్వాత 22 కేసులతో కేరళ రెండో స్థానంలో నిలిచింది. ఎయిమ్స్ 24/7 హెల్ప్లైన్ నంబర్ 9971876591ను ఏర్పాటు చేసింది. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 13 దాకా 703 షిప్పులు, అందులోని 25,504 మంది సిబ్బందిని తీరం నుంచే వెనక్కు పంపించేశామని కేంద్ర షిప్పింగ్ శాఖ ప్రకటించింది. దేశ, విదేశాలకు గ్రూప్ టూర్లను నిషేధిస్తూ ముంబై పోలీసులు 144 సెక్షన్ను విధించారు. టూర్ ఆపరేటర్లు ఎవరైనా దానిని అతిక్రమిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్తార్పూర్ కారిడార్ టూర్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ నుంచి అన్ని రకాల ప్రయాణాలపై నిషేధం విధించింది. కరోనా బాధితుడి వివరాలను బయటపెట్టినందుకు జమ్మూ కాశ్మీర్ డాక్టర్ను సస్పెండ్ చేశారు. ఢిల్లీలో తొలి కరోనా పేషెంట్ పూర్తిగా కోలుకున్నాడు. రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి నుంచి అతడిని డిశ్చార్జ్ చేశారు.
ఇటలీ, ఇరాన్ నుంచి తీసుకొచ్చిన్రు
ఇటలీ ఎయిర్పోర్టులో చిక్కుకుని గోస తీస్తున్న ఇండియన్లు ఎట్టకేలకు దేశానికి తిరిగొచ్చేశారు. 211 మంది స్టూడెంట్లు సహా 218 మందిని మిలాన్ నుంచి రక్షించి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఆదివారం ఉదయం 9.45 గంటలకు ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎయిరిండియా ప్రత్యేక విమానం ల్యాండ్ అయినట్టు విదేశాంగ శౄఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ తెలిపారు. అందరినీ ఢిల్లీలోని చావ్లా ఐటీబీపీ క్వారెంటైన్కు తరలించారు. ఇటు ఇరాన్లో చిక్కుకున్న వారినీ ఇండియాకు తీసుకొచ్చారు. మూడో బ్యాచ్లో 234 మందిని రెండు ఎయిరిండియా ప్రత్యేక విమానాల్లో రాజస్థాన్లోని జైసల్మీర్కు తీసుకొచ్చామని, అందులో 131 మంది స్టూడెంట్లు కాగా, 103 మంది భక్తులున్నారని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. అందరినీ అక్కడి ఇండియన్ ఆర్మీ వెల్నెస్ సెంటర్లో క్వారెంటైన్కు పంపారు. బ్రిటన్కు చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో విమానంలోని 289 మందినీ దించేశారు. మొన్నటిదాకా మున్నార్లోని ఓ హోటల్ క్వారెంటైన్లో ఉన్న అతడు, అతడి భార్య, అధికారుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. ఎలాగోలా వాళ్ల ఆచూకీని పట్టేసి కొచ్చి ఎయిర్పోర్టులో పట్టుకున్నారు. దుబాయ్ వెళ్లేందుకు ఎమిరేట్స్ ఫ్లైట్ ఎక్కిన వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మిగతా ప్రయాణికులనూ కరోనా ముప్పుతో అందరినీ క్వారెంటైన్కు పంపారు.