- న్యూఇయర్ సెలబ్రేషన్లో ఈగల్ ఆపరేషన్
హైదరాబాద్, వెలుగు: న్యూఇయర్ వేడుకల సందర్భంగా ఈగల్ ఫోర్స్ నిర్వహించిన స్పెషల్ ఆపరేషన్లలో నలుగురు డీజే ఆపరేటర్లు సహా ఐదుగురు పట్టుబడ్డారు. డ్రగ్ టెస్టుల్లో ఈ ఐదుగురికీ గంజాయి పాజిటివ్ వచ్చింది. 15 ఈగల్ టీమ్స్, 8 ఎక్సైజ్ బృందాలు.. స్థానిక పోలీసులతో కలిసి రైడ్స్ నిర్వహించారు. పబ్బులు, రిసార్టులు, ఫామ్హౌస్ల్లో జరుగుతున్న పలు పార్టీల్లో డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు అనుమానిత ప్రాంతాల్లో ఉన్న 51 మందికి, వెహికల్ చెకింగ్లో 38 మందికి డ్రగ్స్ టెస్టులు చేశారు.
యూరిన్, సలైవా టెస్టులు నిర్వహించారు. ఈ క్రమంలో ఈగల్ ఆపరేషన్లో బఫెలో విల్డ్ వింగ్స్లో డీజే ఆపరేటర్గా పనిచేస్తున్న కె.శ్రీధర్(35), షెర్లాక్స్ పబ్ డీజే ఆపరేటర్ డేవిడ్(28), ఇల్యూజన్ పబ్ డీజే ఆపరేటర్ తన్విర్ సింగ్(25), వేవ్ పబ్లో డ్రమ్మర్గా పనిచేస్తున్న డి.మణిభూషణం(25), సనత్నగర్కు చెందిన ప్రైవేట్ ఉద్యోగి రవికిరణ్కు గంజాయి పాజిటివ్ వచ్చింది. దీంతో ఈ ఐదుగురిని ఈగల్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్ టెస్టుల్లో పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడంతో పాటు డీఅడిక్షన్ సెంటర్ రిహాబిలిటేషన్ సెంటర్లకు తరలించనున్నారు.
