
ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం రేపు(శనివారం) కొలువుదీరనుంది. 25మందితో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మంత్రి వర్గంలో సగం మంది SC,ST,BC, మైనార్టీలకు స్థానం కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో జరుగుతున్న వైఎస్సార్ఎల్పీ సమావేశంలో జగన్ మాట్లాడారు. మంత్రివర్గంలో అయిదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని, SC,ST,BC, మైనార్టీ, కాపులకు ఉప ముఖ్యమంత్రులుగా అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. అలాగే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు ఉంటాయని, కొత్తవారికి కేబినెట్లో అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అంతేకాదు రాష్ట్రం మొత్తం మనవైపు చూస్తోందన్న సీఎం జగన్ ..సంక్షేమం కోసం పాలనలో చాలా మార్పులు తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. అవినీతికి ఏమాత్రం తావివ్వకుండా పాలన జరగాలని ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి జ్యుడీషియల్ కమిషన్ గురించి అడిగానని తెలిపారు సీఎం జగన్. ఇక నుంచి ప్రతి టెండర్ల ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరగాలన్నారు. ప్రతి కాంట్రాక్ట్ ప్రక్రియ మొదటి నుంచి జడ్జి వద్దకు వెళ్తుందన్నారు. ఏడు రోజుల పాటు పబ్లిక్ డొమైన్లో టెండర్ల ప్రక్రియ ఉంటుందని.. జ్యుడీషియల్ కమిషన్ సూచనల మేరకు ప్రతి టెండర్లో మార్పులు ఉంటాయన్నారు. ఆరోపణలు వచ్చిన వాటిపై రివర్స్ టెండర్ ప్రక్రియ చేడతామని స్పష్టం చేశారు. రివర్స్ టెండరింగ్లో ఎంత మిగిలిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. చంద్రబాబు పాలనలో అంచనాలకు మించి టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు.
అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామన్న జగన్.. మనం వేసే ప్రతి అడుగు ద్వారా ప్రగతి పెరగాలని సూచించారు. నామినేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50శాతం పనులు అప్పగిస్తామని హామీ ఇచ్చారు.