
- ప్రతిపాదిత స్థలంలోనే మేడిగడ్డ నిర్మాణం
- కాళేశ్వరం కమిషన్ విచారణలో ఇంజినీర్లు
- ఐదుగురు ఇంజినీర్లను ప్రశ్నించిన కమిషన్
- రిటైర్డ్ జస్టిస్ నే ఎదురు ప్రశ్నించిన ఆఫీసర్లు
- వాళ్ల సమాధానాలపై కమిషన్ సీరియస్
హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ ఊపందుకుంది. ఇవాళ నిర్వహించిన ఓపెన్ కోర్టులో ఐదుగురు ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీల డిజైన్లు అప్రూవల్ పొందిన తర్వాత మార్పులు, చేర్పులు ఏమైనా జరిగాయా.? డిజైన్ అప్రూవల్ చేసే ముందు, తర్వాత నిబంధనలు పాటించారా అని కమిషన్ అడిగింది. హైపవర్ కమిటీ నిబంధనలు క్రైటేరియా ఫాలో అయ్యారా..? లేదా..? అని ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించింది. దీనిపై ఇంజినీర్లు స్పందిస్తూ.. అన్నారం, సుందిళ్ల లొకేషన్లు మార్చామని స్పష్టం చేశారు. మేడిగడ్డ బ్యారేజీ ప్రతిపాదిత స్థలంలో నిర్మాణం జరిగిందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషన్ అడిగే ప్రశ్నలకు పలువురు ఇంజినీర్లు కౌంటర్ క్వశ్చన్స్ వేశారు. దీనిపై కమిషన్ సీరియస్ అయ్యింది. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు మాజీ సీడీవో, ఇంజినీర్లు పొంతన లేని సమాధానాలు ఇవ్వడం గమనార్హం. మూడు బ్యారేజీలకు సంబంధించి డిజైన్లలో ఎలాంటి సమస్యా లేని, అంతా నిబంధనల ప్రకారమే ఉందని కమిషన్ కు ఇంజినీర్లు తెలిపారు. మధ్యాహ్నం వరకు ఇద్దరు ఇంజినీర్లను విచారించిన కమిషన్ ఆ తర్వాత మరో ముగ్గురు ఇంజినీర్లను ప్రశ్నించింది. ఇదిలా ఉండగా గతంలో కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన జలవనరుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వీ ప్రకాశ్ ఇవాళ కమిషన్ కు తన అఫిడవిట్ ను అందజేశారు.