మెదక్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

మెదక్  జిల్లాలో  వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మృతి

మెదక్​టౌన్, వెలుగు: నీటి గుంతలో పడి మహిళ మృతి చెందిన ఘటన మెదక్​ పట్టణంలోని పిట్లంబేస్​ వీధిలో జరిగింది. సీఐ నాగరాజు కథనం ప్రకారం.. హవేలీ ఘనపూర్​ మండలం బి.తిమ్మాయిపల్లికి చెందిన పెద్దబోయిన మంజుల (46) కుమారుడు ప్రశాంత్​తో కలిసి పిట్లంబేస్​ వీధిలో అద్దెకు ఉంటూ కూలీ పనులు చేస్తూ బతుకుతోంది.

మంగళవారం ఉదయం బహిర్భూమికి వెళ్లిన మంజుల తిరిగి రాకపోవడంతో కుమారుడు ప్రశాంత్​ చుట్టుపక్కల వెతకగా కొద్ది దూరంలో ఉన్న నీటి గుంతలో పడి చనిపోయి కనిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతోసంఘటనా స్థలానికి చేరుకొని డెడ్​బాడీని బయటకు తీసి పోస్టుమార్టం కోసం మెదక్​ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతురాలి కుమారుడు ప్రశాంత్​ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

గుండెపోటుతో మెకానిక్..​

గుండెపోటుతో బైక్​ మెకానిక్​ మృతి చెందిన ఘటన మెదక్​ పట్టణంలో జరిగింది. కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. మెదక్​ పట్టణంలోని పిట్లంబేస్​ వీధిలో నివాసం ఉండే బైక్​ మెకానిక్​ అబ్రబోయిన అశోక్​ (47) మంగళవారం ఉదయం ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్​లోని  ఓ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. 

కారు ఢీకొని వ్యక్తి..

కౌడిపల్లి, వెలుగు: కారు ఢీకొని ఒకరు మృతి చెందారు. కౌడిపల్లి మండలం తునికి గ్రామ పంచాయతీ దేవుల తండాకు చెందిన కోల రమేశ్ (38) మంగళవారం ఉదయం  పొలానికి వెళ్లి వస్తుండగా మెదక్ నుంచి నర్సాపూర్ వస్తున్న కారు వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో రమేశ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

భార్య కాపురానికి రాలేదని భర్త సూసైడ్..

భార్య కాపురానికి రాలేదని భర్త సూసైడ్ చేసుకున్న ఘటన కౌడిపల్లి మండలం రాజిపేట గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన బాంచ శ్రీకాంత్ (31) అతడి భార్య తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో భార్య తల్లిగారింటికి వెళ్లిపోయింది. శ్రీకాంత్ అత్తగారింటికి వెళ్లి అడిగితే నీతో సంసారం చేయను విడాకులు ఇస్తానని చెప్పడంతో శ్రీకాంత్ మనస్తాపానికి గురై గడ్డి మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు హైదరాబాద్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

బైక్​ఢీకొని మహిళ.. 

కొండపాక, (కుకునూరుపల్లి): రాజీవ్ రహదారిపై రోడ్డు దాటుతుండగా ఓ మహిళ మృతి చెందిన ఘటన కుకునూరుపల్లి మండల కేంద్రంలో జరిగింది. ఎస్ఐ శ్రీనివాస్ కథనం ప్రకారం.. మంగోల్ గ్రామానికి చెందిన లగిశెట్టి మణెమ్మ (50) మంగళవారం కారంపొడి పట్టించడానికి మెకానిక్ సెంటర్ వద్ద రోడ్డు దాటుతుండగా హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వస్తున్న బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ప్రమాదానికి కారణమైన వ్యక్తి కరీంనగర్ పట్టణంలో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నట్లు తెలిసింది. మృతుడి కుమారుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.