అక్కాచెల్లెళ్లపై ఐదుగురు అత్యాచారం

అక్కాచెల్లెళ్లపై ఐదుగురు అత్యాచారం

ఏడాదిగా ఐదుగురి అఘాయిత్యం

చాంద్రాయణగుట్ట, వెలుగు: మైనర్​ అక్కాచెల్లెళ్లపై ఐదుగురు అత్యాచారానికి పాల్పడిన ఘటన పాతబస్తీలో వెలుగుచూసింది. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. కామాటిపురా ఇన్‌స్పెక్టర్ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్​లోని పాతబస్తీకి చెందిన బాలిక(16) స్థానిక స్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఆమె చెల్లెలు(13) అదే బడిలో ఏడో తరగతి చదువుతోంది. అదే స్కూల్లో 8వ తరగతి చదువుతున్న బాలుడు(14) ఏడాదిగా ప్రేమిస్తున్నానంటూ తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఇదే క్రమంలో పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఈ విషయాన్ని కామాటిపురా ఉస్మాన్‌సాగర్ ఏరియాకు చెందిన 15, 17 సంవత్సరాల ఫ్రెండ్స్‌ ఇద్దరికి, 19, 20 ఏండ్ల యువకులిద్దరికి చెప్పాడు. వారు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ బాలికపై ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. ఈ ఐదుగురిలో ఒకరు ఆమె చెల్లెలుపై కూడా అత్యాచారం చేశారు. స్కూల్‌ నుంచి ఇంటికి ఎందుకు లేట్‌గా వస్తున్నారని బాలికల్ని మేనమామ నిలదీయగా అసలు విషయం బయటపడింది. కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికల్ని ఆసుపత్రికి తరలించారు. పోక్సో చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసి నిందితులైన ముగ్గురు బాలలు, ఇద్దరు యువకులను రిమాండ్‌కు తరలించారు.