
హైదరాబాద్లో సభ్య సమాజం తలదించుకునే ఘటన జరిగింది. ఐదేళ్ల బాలుడిపై లైంగిక దాడి చేసి ఆ తర్వాత హత్య చేశాడు ఓ కామాంధుడు. ఈ ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామంతాపూర్లో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్కు చెందిన ఈశ్వర్ పాండే, పులేశ్వరి పాండే దంపతులు రామంతాపూర్లోని కేసీఆర్ నగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి పూనం(10), గడియ(8), మనోజ్ పాండే(5) అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.
కుటుంబంతో కలిసి కేసీఆర్ నగర్లో ఉంటున్న ఈశ్వర్ పాండే స్థానికంగా ఉన్న ఓ టింబర్ డిపోలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో 2025, ఆగస్ట్ 12 ఈశ్వర్ పాండే కుమారుడు మనోజ్ పాండే తప్పిపోయాడు. ఈ మేరకు పోలీసులకు కంప్లైంట్ చేశాడు ఈశ్వర్ పాండే. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసుల విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈశ్వర్ పాండే పని చేసే టింబర్ డిపోలోనే పని చేస్తోన్న బీహార్కు చెందిన కమర్ అనే వ్యక్తి బాలుడిని కిడ్నాప్ చేసి ఆ తర్వాత పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు.
లైంగిక దాడి చేసిన అనంతరం విషయం బయటకు పొక్కకుండా బాలుడిని గొంతు నులిమి చంపేశాడు కమర్. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. హంతకుడు కమర్ని అదుపులోకి తీసుకున్నారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఉప్పల్ పోలీసులు, బాలుడు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ మార్చురీకి తరలించారు. ఐదేళ్ల బాలుడిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.