మరో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా పొగలు.. లక్నో విమానాశ్రయంలో ఘటన

మరో విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం.. ల్యాండ్ అవుతుండగా పొగలు.. లక్నో విమానాశ్రయంలో ఘటన

అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం జరిగి రోజులు గడవక ముందే మరో విమానం ప్రమాదానికి గురైంది. హజ్ యాత్రికులతో ఇండియా వస్తున్న ఫ్లైట్.. భారీ ప్రమాదాన్ని తప్పించుకుంది. ఆదివారం (జూన్ 15) ఉదయం 250 మంది హజ్ యాత్రికులతో వస్తున్న సౌదీ ఎయిర్ లైన్స్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. 

లక్నోలోని చౌదరీ చరణ్ సింగ్ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ లో విమానం ల్యాండింగ్ అవుతుండగా చక్రాల నుంచి మంటలు చెలరేగాయి. సౌదీ అరేబియా నుంచి వస్తున్న విమానంలో చక్రాల నుంచి మంటలు, పొగ రావటం ఆందోళనకు గురి చేసింది. 

సౌదీలోని జెడ్డా విమానాశ్రయం నుంచి శనివారం రాత్రి 10.45 గంటలకు బయల్దేరిన SV 3112 అనే విమానం.. లక్నోలో ఉదయం 6.30 గంటలకు ల్యాండ్ అయ్యింది. ఫ్లైట్ లో ఉన్న 250 మంది ప్రయాణీకులతో పాటు సిబ్బందీ అందరినీ అత్యవసరంగాకిందికి దింపారు. అందరూ  సురక్షితంగానే ఉన్నట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటించారు. 

అసలు ఏం జరిగింది?

విమానం రన్ వే పై ల్యాండ్ అవుతున్న సందర్భంలో ఎడమ చక్రం నుంచి మంటలు చెలరేగి పొగ కమ్ముకుంది. వెంటనే గమనించిన పైలట్ ఫ్లైట్ ను సడెన్ గా ఆపేసి ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పేసి.. 20 నిమిషాల్లో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో అందరూ ప్రయాణీకులు క్షుమంగా ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే ఘటన సమయంలో కొంత ఆందోళనకు గురయ్యారని తెలిపారు. 

 

గుజరాత్‏లో ఘోర విమాన ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అహ్మదాబాద్‎లోని సర్ధార్ వల్లభభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయ సమీపంలోని మేఘాని ప్రాంతంలో చెట్టును ఢీకొని ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలింది. 230 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 సిబ్బంది మొత్తం 242 మందితో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం ఎయిర్ ఇండియా బోయింగ్ విమానం అహ్మదాబాద్ లో కుప్పకూలింది. ఈ ఘటనలో మొత్తం 274 మంది మృతి చెందారు. ఈ ప్రమాదం జరిగిన మూడు రోజుల్లోనే ఇవాళ (జూన్ 16) సౌదీ విమానం అత్యవసర ల్యాండింగ్ అవ్వటం ఎయిర్ పోర్ట్ అధికారులను ఆందోళనకు గురిచేసింది.