గర్మిళ్ల జడ్పీ హైస్కూల్​ దుస్థితిపై స్టూడెంట్స్​ ఆందోళన

గర్మిళ్ల జడ్పీ హైస్కూల్​ దుస్థితిపై స్టూడెంట్స్​ ఆందోళన

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల జిల్లా పరిషత్​ హైస్కూల్​లో ఫ్లోరింగ్​ పూర్తిగా శిథిలమై విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. క్లాస్​రూంలు, వరండాల్లో ఏండ్ల కిందట కంకర, బండలతో వేసిన ఫ్లోరింగ్ పగిలిపోయి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. వరండాల్లో నడవడానికి, క్లాస్​రూంలలో కూర్చోవడానికి విద్యార్థులు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. స్కూల్​లో 250 మంది స్టూడెంట్లు ఉన్నారు.

12 క్లాస్​రూం​లు ఉండగా, అన్నింట్లోనూ ఫ్లోరింగ్​ అధ్వానంగా మారింది. బండలు కాళ్లకు తట్టుకొని విద్యార్థులు తరచూ కిందపడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు స్టూడెంట్లకు చేతులు విరిగాయి. గుంతల్లో బండల కింద పాములు, తేళ్లు దూరుతుండడంతో ప్రాణాలకు ప్రమాదం పొంచివుందని ఆందోళన చెందుతున్నారు.  

రినోవేషన్​పై నిర్లక్ష్యం...  

ఫ్లోరింగ్​తో పాటు స్కూల్​లో నెలకొన్న సమస్యలను టీచర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని వాపోతున్నారు. గతంలో ఎమ్మెల్యే ఫండ్​ నుంచి రినోవేషన్​ కోసం రూ.50 లక్షలు శాంక్షన్​ చేశారు. పనులు చేపట్టేలోగా ప్రభుత్వం 'మన ఊరు–మన బడి' ప్రోగ్రాంను ప్రకటించడంతో ఎమ్మెల్యే ఫండ్​ను క్యాన్సల్​ చేశారు.

విద్యాశాఖ అధికారులు సైతం మన ఊరు–మన బడిలో పెట్టించి రిపేర్లు చేయిస్తామని ఊరించి చివరకు హ్యాండ్​ ఇచ్చారు. జిల్లాలో ఫస్ట్​ ఫేస్​లో 248 స్కూళ్లను ఎంపిక చేసినప్పటికీ అధ్వానంగా ఉన్న గర్మిళ్ల స్కూల్​ను ఎందుకు విస్మరించారో అధికారులకే తెలియాలి.  

స్కూల్​ ఎదుట విద్యార్థుల ధర్నా...  

గర్మిళ్ల హైస్కూల్​లో శిథిలమైన ఫ్లోరింగ్​ను తొలగించి కొత్తగా నిర్మించాలని, ఇతర సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు శుక్రవారం పీడీఎస్​యూ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. స్కూల్​ మెయిన్​ గేట్​ ఎదుట బైటాయించి తమ సమస్యలను పరిష్కరించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదన్నారు.

క్లాస్​రూంలు, వరండాల్లోని ఫ్లోరింగ్​ పగిలిపోయి గుంతలయ్యాయని, బండలు తట్టుకొని కిందపడి గాయాలవుతున్నాయని, పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈవో పోచయ్య వచ్చి 15 రోజుల్లో రిపేర్లు చేయిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.