ధరణి పేరుతో తెలంగాణలో కుట్ర జరిగింది : గద్దర్

ధరణి పేరుతో తెలంగాణలో కుట్ర జరిగింది : గద్దర్

ధరణి పేరుతో తెలంగాణలో పెద్ద కుట్ర జరిగిందని తెలిపారు ప్రజా యుద్ధనౌక గద్దర్. మే 29వ తేదీ సోమవారం అలైన్మెంట్ మార్చాలని త్రిబుల్ ఆర్ బాధిత రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రెండు రోజుల రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా తొలి రోజు దీక్షలో గద్దర్ పాల్గొని రైతులకు మద్దతు తెలిపారు. భూ సమస్య తెలంగాణ సమస్య.. నిజాం ఉన్నప్పటి నుంచి ఇక్కడ భూమి సమస్య ఉందన్నారాయన. పంట పెట్టుబడి సాయం పేరుతో బీడు భూములుగా మార్చారని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు గద్దర్. బీడు భూములను కార్పొరేట్ కు ధారాధత్తం చేశారని వ్యాఖ్యానించారు. 

పశ్చిమ బెంగాల్ లో కూడా భూ పోరాటాలు జరిగాయి..ప్రపంచ యుద్ధాలు కూడా భూమి కోసమే జరిగాయని గద్దర్ గుర్తు చేశారు. తెలంగాణలో గత 10 ఏళ్ల కాలంలో రైతులకు, నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని వాపోయారు. భువనగిరి సభ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటం మొదలైందన్నారు గద్దర్. ఓటు అనే ఆయుధంతో పోరాడండి, విప్లవాన్ని తీసుకురండి అంటూ పిలుపునిచ్చారు. పార్లమెంటులో రైతు చట్టాలు చేస్తే, పంజాబ్ రైతులు పోరాటం చేసి రద్దు చేయించారు.. అదే విధంగా తెలంగాణలో భూసేకరణ జీవోను రద్దు చేయిద్దాం.. భూములు కోల్పోతున్న రైతులకు భూమి ఇవ్వాలని కోరుతున్నామని గద్దర్ పేర్కొన్నారు.