బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ జరిగింది. మధ్యాహ్నం E 1, E 2 మెస్ లో ఫ్రైడ్ రైస్ తిన్న దాదాపు 60 మంది అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆర్జీయూకేటీ హాస్పిటల్ కు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. బాధిత విద్యార్థులను అంబులెన్సులతో పాటు ఫ్యాకల్టీ సొంత కార్లలో హాస్పిటళ్లకు తరలించారు. కొందరు విద్యార్థులకు ప్రస్తుతం నిజామాబాద్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ కొనసాగుతోంది. ఇదిలాఉంటే ఫుడ్ పాయిజన్ విషయం బయటకు రాకుండా అధికారులు ప్రయత్నించినట్లు వార్తలు వస్తున్నాయి. 

బాసర ట్రిపుల్ ఐటీ ఫుడ్ కాంట్రాక్టర్ ను మార్చాలని విద్యార్థులు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఆహారం నాసిరకంగా ఉంటోందంటూ పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఘటనకు సంబంధించి బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ను ఫోన్లో సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించలేదు.

ఫుడ్ పాయిజన్ ఘటనపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పందించారు. విద్యార్థులను వెంటనే హాస్పిటల్ కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని బాసర ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ను ఫోన్ లో ఆదేశించారు. ఘటనపై విచారణ జరిపి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించారు. బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.